తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ మంగళవారం (మార్చి 29) రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌తో కౌంటర్ల పర్వం మొదలైంది. రెండు పార్టీలకు చెందిన నేతలు పరస్ఫరం విమర్శలు చేసుకుంటున్నారు. రాహుల్ తెలుగులో చేసిన ట్వీట్‌కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇవ్వగా, తాజాగా రేవంత్ రెడ్డి కూడా కవిత ట్వీట్‌పై, టీఆర్ఎస్ ఎంపీల తీరుపై దీటుగా స్పందించారు.


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కవిత ట్వీట్‌కు సెటైర్ విసురుతూ.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాడడం లేదని, సెంట్రల్ హాల్లో బాగా కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ పెట్టిన సంతకంతోనే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తు చేశారు. ‘‘ఇకపై FCIకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.






రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేసిన కాసేపటికే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా ఎమ్మెల్సీ కవిత మరో ట్వీట్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ట్వీట్లు చేయడం కాదని, పార్లమెంటులో తమకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ‘‘మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హరియాణాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.






హరీశ్ రావు కూడా రాహుల్ గాంధీ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి రాహుల్‌ గాంధీ గారు.. తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌ లో మా ఎంపీలతో కలిసి మీరు ఆందోళన చేయండి. రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి.’’ అని ట్వీట్ చేశారు.