కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై టీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగిందని.. ఇక్కడ నేతలు ఆ స్కాంలో ఉన్నారనే ఆరోపణలు చేస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. పంజాబ్ ఎన్నికల్లో ఆప్‌కు ఆర్థిక సహాయం చేశారనే ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. తెలంగాణ ఆప్ ఇంచార్జి సోమనాథ్ భారతి మాట్లాడుతూ అవినీతిపరులైన కేసీఆర్‌ను కలవబోమని చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 'అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలను కేజ్రీవాల్ కలవరని తాము భావించాం.. కానీ ఏం జరిగిందో ఏమో కానీ కేసిఆర్ వెళ్లి కేజ్రీవాల్‌ను కలిశారు. పంజాబ్‌కు ఆయనతో కలిసి వెళ్లారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీలకు వందల కోట్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అని రేవంత్ డిమాండ్ చేశారు. 


ఉపఎన్నికలు వస్తే ఐటీ కంపెనీలపై దాడులా..


కేసిఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తే వారి ఇళ్లలో సోదాలు ఎందుకు జరగడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'విచారణ సంస్థలు కేసిఆర్ ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై ఎందుకు స్పందించడం లేదు. రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తే ఐటీ కంపెనీల మీద దాడులు జరుగుతున్నాయి. 30 సంస్థల్లో సోదాలు జరిగాయి. కేసిఆర్ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఎందుకు జరగడం లేదు. వారు ఆధారాలు మాయం చేసే ప్రమాదం లేదా..? ఎందుకు కేసిఆర్ కుటుంబానికి ఆ అవకాశం ఇస్తున్నారు..? మీరే ఆరోపణలు చేస్తున్నారు. మీరే అధికారంలో ఉన్నారు.. అయినా వారి ఇళ్లలో ఎందుకు సోదాలు జరగలేదు..? దీని వెనుక ఉన్న లాలూచీ ఏంటి..?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు 


'బీజేపీ, టీఆర్ఎస్ కలిసికట్టుగా నాటకం'


ఫినిక్స్, సుమధర, వాసవి కంపెనీలపై దాడులు ఎందుకు ధృవీకరించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'ప్రతీ ఎన్నికలప్పుడు భయపెట్టి లొంగదీసుకోవడం బీజేపీకి అలవాటు. గతంలో 140 కోట్ల నగదు దొరికిన హెటరో కేసును సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు..? రియల్ ఎస్టేట్ సంస్థల దాడుల్లో దొరికిన సమాచారం బయట పెట్టాలి. సిబిఐ, ఈడి ఎన్నికలు నిర్వహించే బీజేపీ అనుబంధ విభాగాలుగా పని చేస్తున్నాయి. ఈడి, సిబిఐతో భయపెట్టి నెగ్గాలని బీజేపీ చూస్తోంది. ఈడీ అంటే బీజేపీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ లాగా మారింది. బీజేపీ, టీఎర్ఎస్ కలిసికట్టుగా నాటకాన్ని రక్తి కట్టిస్తున్నాయి' అని రేవంత్ రెడ్డి అన్నారు. 


'రాజకీయాల కోసం సమాజం మధ్య చీలిక తెస్తున్నారు'


భూ కబ్జాలు చేశారన్న ఈటలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎమ్మేల్యే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల ప్రయోజనాల కోసం టీఆర్ఎస్, బీజేపీ సమాజం మధ్య చీలిక తెస్తున్నాయి మండిపడ్డారు. బీజేపీ చర్యలను ప్రతి పౌరుడు ఖండించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని ఆ పార్టీ నాయకులు చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏ స్కాంలో నా సొంత సోదరుడు ఉన్న ఉరి తీయండని తేల్చి చెప్పారు. సంస్థలు అన్ని మీవే కదా.. అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలిసిన వారు ఎవరు స్కాంలో ఉన్న దానికి నాకు సంబంధం ఉంటుందా అని మల్కాజ్ గిరి ఎంపీ ప్రశ్నించారు. చుట్టాలు ఉంటే భాగస్వాములం అవుతమా అని అడిగారు. ఎవరు అక్రమాలకు పాల్పడిన నడి బజార్లో ఉరి తీయండని మీడియా ముఖంగా తెలిపారు.  


'ఈ నెలాఖరుకు మునుగోడు అభ్యర్థి ఎంపిక'


ఈ నెలాఖరు వరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తాం. ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో సమయం ఇస్తానని చెప్పారు రేవంత్


'లాలూచీ వల్లే విచారణ జాప్యం'


ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రముఖులు ఉన్నట్లు ఆధారాలతో సహా వార్తలు వస్తున్నాయని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. పదవిలో ఉన్న వాళ్ళు నిజాయితీని నిరూపించుకోవాలి సూచించారు. కుంభకోణం జరిగింది అని చెప్పిన తరువాత వివరాలు బహిర్గతం చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. 


'కవిత రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలి'


టీఆరెస్ పార్టీ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని దళిత కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రితం విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ రౌడీ సమితిగా మారిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ టీఆరెస్ అంతర్గత మిత్రుత్వాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. శ్రీలంకలో అధ్యక్షుడికి పట్టిన గతి తెలంగాణలో కేసీఆర్ కి పడుతుందని విమర్శించారు. కవితపై వస్తున్న ఆరోపణలకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రం లోకి రావాలన్నారు.