Hyderabad Fire Accident | హైదరాబాద్‌: చార్మినార్‌ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. గుల్జార్ హౌస్ చౌరస్తాలోని G+2 భవనంలో మంటలు చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగిన ఘటనలో మొత్తం 17 మంది మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారిలో ఏడేళ్ల లోపు వయస్సున్న 8మంది చిన్నారులు ఉన్నారు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు, అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిప్ర‌మాదంపై అగ్నిమాప‌క శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడం వ‌ల్లే అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. వంట గదిలో సిలిండర్ పేలడం, ఇంట్లో చెక్క‌తో చేసిన ప్యానెళ్ల వ‌ల్లే మంట‌లు వేగంగా వ్యాపించాయ‌ని పేర్కొన్నారు. 

ఈరోజు ఉదయం 06:16 గంటలకు చార్మినార్‌లోని గుల్జార్ హౌస్ చౌరస్తాలోని G+2 భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం అందడంతో మొఘల్‌పురా నుంచి ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఆపై మొత్తం బిల్డింగ్ కు మంగలు వ్యాపించాయి. అగ్నిమాపక, రెస్క్యూ ఆపరేషన్లు ఒకేసారి జరిగాయి. ఈ క్రమంలో మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. గాయపడిన వారిని అంబులెన్సులలో పలు ఆసుపత్రులకు తరలించారు.

ఆదివారం కావడంతో ప్రమాద సమయంలో నిద్రలోనే..

అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఓవైపు మంటలను ఆర్పుతూనే మరోవైపు భవనంలో చిక్కుకుని స్పృహ కోల్పోయిన వారిని, కాలిన గాయాలైన వారిని భయటకు తీసుకొచ్చారు. వారిని అంబులెన్స్ లలో మలక్ పేట యశోద, డీఆర్‌డీవో, ఉస్మానియా, అపోల్ ఆస్పత్రులకు తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అసలే ఆదివారం కావడంతో వారు ఇంకా నిద్ర నుంచి మేల్కోలేదు. అందువల్లే మొదటి అంతస్తు నుంచి మంటలు బిల్డింగ్ మొత్తానికి వ్యాపించినా అప్రమత్తం కాలేకపోయారు. అగ్నిప్రమాదం గురించి గుర్తించేలోపే మంటలు అంతా వ్యాపించాయి. పొగ పీల్చడం, ఊపిరి ఆడకపోవడంతో వెంటనే వారు స్పృహ కోల్పోయారు. దాంతో వారిని ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోయింది.

ప్రమాదం జరిగిన భవనానికి ఫైర్ ఎగ్జిట్ (అత్యవసరంగా బయట పడేందుకు మార్గం) లేకపోవడంతో వారు భవనం నుంచి బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు ఇరుకైన గల్లీలు కావడంతో అగ్నిమాపక యంత్రాలు రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయడానికి ఇబ్బందులు తలెత్తాయని స్థానికులు చెబుతున్నారు. అయితే అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి లోపల చిక్కుకున్న వారిని రక్షించి హాస్పిటల్స్‌కు తరలించామని ఎస్డీఆర్ఎఫ్ తెలిపింది.

మృతుల వివరాలు..ప్రహ్లాద్ 70 ఏళ్లుమున్నిభాయి 70 ఏళ్లురాజేంద్రకుమార్‌ మోదీ 67 ఏళ్లుసుమిత్ర 60 ఏళ్లుహమే 7 ఏళ్లుఅభిషేక్‌ మోదీ 31 ఏళ్లుశీతల్ జైన్ 35 ఏళ్లుప్రియాంష్ 4 ఏళ్లుఇరాజ్ 2 ఏళ్లుఆరుషి జైన్‌ 3 ఏళ్లురిషబ్ 4 ఏళ్లుప్రథమ్ 18 నెలలుఅనుయాన్ 3 ఏళ్లువర్ష 35 ఏళ్లుపంకజ్ 36 ఏళ్లురజిని 32 ఏళ్లుఇద్దు 4 ఏళ్లు

హైదర్‌గూడ అపోలోలో చికిత్స పొందుతున్న ఐదుగురు మృతిచెందారు. హైదర్ గూడ అపోలో హాస్పిటల్ నుంచి పంకజ్ మోదీ, అతని భార్య వర్ష మోదీ, సోదరి రజిని అగర్వాల్, పంకజ్ మోదీ ఇద్దరు పిల్లలు అన్య మోడీ, ఇద్దు మోదీల మృతదేహాలను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. 

మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంతో పాటు బిల్డింగ్ లోపల చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి సహాయక చర్యలలో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి 2 గంటలు టైం పట్టింది. లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి, మంటలను ఆర్పడానికి అధికారులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని ఎస్డీఆర్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.