Osmania University News | హైదరాబాద్: యూజీసీ – సీఈసీ 16వ అంతర్జాతీయ ప్రకృతి ఫిల్మ్ ఫెస్టివల్ కోసం జరిగిన లఘుచిత్ర పోటీల్లో ఓయూ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC) సత్తా చాటింది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోని విద్యార్థుల స్థితిగతులపై ఈఎమ్మార్సీ డైరెక్టర్ పి. రఘుపతి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ’Reaching the Unreached’ అభివృద్ధి విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మానవహక్కుల విభాగంలోనూ  సైటేషన్ కు ఎంపికైంది.


యూజీసీ, సీఈసీ ఏటా పర్యావరణం, అభివృద్ధి, మానవహక్కులు, స్వచ్ఛ భారత్ విభాగాల్లో షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన చిత్రాలను ఏటా నిర్వహించే ప్రకృతి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (Prakriti International film festival) లో ప్రదర్శిస్తారు. విజేతలకు ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేస్తారు. జన జీవనానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే ఉద్దేశంతో ఓయూ జర్నలిజం విద్యార్థులు (OU Journalism Students) సంతోష్ ఇస్రం తన మిత్ర బృందంతో కలిసి ఏర్పాటు చేసిన ఏకోపాధ్యాయ భీం చిల్డ్రన్ హ్యాపినెస్ కేంద్రాలపై రఘుపతి లఘుచిత్రం (Short Film) రూపొందించటం అభినందనీయమని ఓయూ రిజిస్ట్రార్ పి. లక్ష్మీనారాయణ అన్నారు. ఈ అవార్డు దక్కటం ఓయూకు గర్వకారణమని, ఈఎమ్మార్సీకి మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపారు.


ప్రతి రోజూ ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణించి చిన్నారులకు విద్యతో పాటు బయటి సమాజాన్ని పరిచయం చేసేందుకు వాలంటీర్లు చేస్తున్న కృషిని ఈఎమ్మార్సీ డాక్యుమెంటరీగా మలచింది. ప్రకృతి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటి సారి ఓయూ ఈఎమ్మార్సీకి అవార్డు దక్కటం గర్వకారణం. త్వరలో జరిగే అంతర్జాతయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రఘుపతి ఈ అవార్డును అందుకోనున్నారు.  




ఈ సందర్భంగా లఘుచిత్ర రూపకర్త రఘుపతిని ఓయూ ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్ దానకిశోర్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం అభినందించారు. ఇలాంటి లఘుచిత్రాలు మరిన్ని రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ రూపకల్పనలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రఘుపతి కృతజ్ఞతలు తెలిపారు.




Also Read: HYDRA Action : హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా పిడుగు - వరుస కూల్చివేతలు - ఇక కబ్జాదారులకు షాకులే !