Rangareddy Crime News: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని రాయల్ విల్లా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 27 ఏళ్ల సివిల్స్ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లోనే ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన 27 ఏళ్ల పూజిత సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. శంషాబాద్ లోని అద్దె గదిలో ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె అద్దె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చున్నీతో ఇంట్లోని కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించింది. తీవ్రంగా వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా.. పూజిత చనిపోయి కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ముందుగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడం, తీవ్రంగా వాసన వస్తుంతడటంతో పూజిత కనీసం మూడు రోజుల కిందట చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 


పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న పూజిత తల్లిదండ్రులు.. తమ కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని.. అతనే తమ కూతురు మరణానికి కారణం అంటూ పూజిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు కలెక్టర్ అయి సమాజ సేవ చేస్తుందనుకుంటే.. ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఏంటంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.  ఈ క్రమంలోనే పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


ఇటీవలే నిజామాబాద్ లో నవవధువు ఆత్మహత్య


నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ర్యాగల రవళిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంతోశ్​ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమ్మాయి, అబ్బాయిలు అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుంటుందని భావించిన ఆ అమ్మాయికి.. అతడిపై అనుమానం మొదలైంది. అతడు మాట్లాడే మాటలు చూస్తుంటే తనను బాగా చూసుకోలేడనే భావన కలిగింది. కానీ తన పెళ్లి అని సంతోషంగా ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని తన మనసులోనే దాచుకుంది. పైకి నవ్వుతూ, పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటూనే లోలోపల మదనపడుతోంది. అయితే ఆదివారం నిజామాబాద్​లో మధ్యాహ్నం 12:15 గంటలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అతనితో కలిసి అస్సలే జీవించలేనని భావించిన ఆ అమ్మాయికి ఏం చేయాలో పాలుపోలేదు. పెళ్లికి ముందే ప్రాణం తీసుకుంటే తన వల్ల కుటుంబ సభ్యుల పరువు పోదని, తనకు బాధ తప్పుతుందని భావించింది. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే.. ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 



అయితే చాలా సేపటి నుంచి కూతురు కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి వెతికారు. చివరకు రూంలో ఉందనుకొని తలుపులు కొట్టారు. ఎంతకూ గది తలుపులు తెరవకపోవడంతో.. తలుపులు పగులగొట్టారు. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురులా ముస్తాబై, ఆనందంగా అత్తగారింటికి వెళ్లాల్సిన ఆ అమ్మాయి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది చూసి షాకైన తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా యువతి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వస్తోందంటూ కంటతడి పెట్టారు. స్థానికుల ద్వారా విషషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెళ్లి కుమారుడు మానసికంగా వేధించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం రవళి మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.