Hyderabad Latest News: తులం బంగారం ధర ప్రస్తుతం రూ.70 వేలకు దగ్గర్లో ఉండగా.. అతి తక్కువ ధరకే తాము ఇస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు బంగారం విక్రయిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. బంగారు వ్యాపారం చేసే యజమనులే టార్గెట్ గా వీరు ఈ మోసాలు చేస్తున్నట్లుగా రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.


వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఆంధ్రప్రదేశ్ లోని కావలికి చెందిన రౌడీ షీటర్ విజయ్ కుమార్ ఈ ముఠాను ఏర్పాటు చేశాడు. తెనాలికి చెందిన సెంథిల్, కావలికి చెందిన సునీల్ గవాస్కర్, నెల్లూరుకు చెందిన సురేష్ లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బోడుప్పల్‌కు చెందిన వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. 


దిలీప్ అనే వ్యాపారవేత్త తన స్నేహితుడితో కలిసి బెంగుళూరు వెళ్ళాడు. బెంగుళూరులో విజయ్‌ కుమార్, హరీష్ లను కలిశారు. అక్కడ దిలీప్.. విజయ్ కు ఆరు లక్షల రూపాయలు చెల్లించడంతో బదులుగా 81 గ్రాముల బంగారాన్ని విజయ్ అందజేశాడు. మిగిలిన 20 గ్రాముల బంగారాన్ని బోడుప్పల్ కు వచ్చి హరీష్ ఇచ్చాడు. వారు ఇచ్చిన బంగారం మేలిమిదైనది కావడంతో వారిని దిలీప్ నమ్మాడు.


అదే నమ్మకంతో తనకు రెండు కిలోల బంగారం కావాలని అడిగాడు. అందులో భాగంగా రూ.20 లక్షలను అడ్వాన్స్ గా బాధితుడు ఇచ్చాడు. పలు దఫాలుగా సుమారు రూ.కోటికి పైగా నగదును విజయ్ కు దిలీప్ ఇచ్చాడు. కాని ఎంతకి బంగారం ఇవ్వలేదు. అనుమానం వచ్చి వ్యాపార వేత్త దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అసలు విషయాలు తెలిశాయి.


విచారణలో నకిలీ నోట్ల దందాతో పాటు నకిలీ బంగారం బిస్కెట్లు వ్యవహారం తెలిసింది. ఒప్పందం డీల్ కుదుర్చుకునే సమయంలో ఏదైనా తేడా వస్తే ఈ గ్రూప్ కి చెందిన వ్యక్తే కానిస్టేబుల్ గా వస్తాడు. వీళ్ళని బెదిరించినట్లుగా నటించి మొత్తం తీసుకొని వెళ్తాడు. ఈ రకం మోసాన్ని నిందితుల నుంచి పోలీసులు విచారణ ద్వారా తెలుసుకున్నారు. మొత్తానికి వారి నుంచి ఐదు కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మరో రూ.6.8 కోట్ల దాకా నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.