HYDRA News: తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు చెబితే చాలు ఆక్రమణదారుల వెన్నులో వణుకు పుడుతోంది. నగరంలో చెరువులను ఆక్రమించిన బడా బాబులు, రాజకీయనేతల బంధువులు, చివరికి అధికార పార్టీ నేతల్లో సైతం హైడ్రా తీరుతో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే కూల్చివేతలలో భాగంగా ఇప్పటి వరకూ N కన్వెన్షన్ వంటి సెలబ్రెటీల ఆస్తులనే కాదు, పేదల గుడిసెలు, ఇళ్లు సైతం హైడ్రా బుల్డోజర్ దెబ్బకు నేలమట్టమైయ్యాయి. ఇంతలా చెరువులు ప్రక్షాళన పేరుతో దూసుకుపోతున్న హైడ్రాపై జనం ఏమంటున్నారు. హైదరాబాద్ నగరవాసుల స్పందన ఎలా ఉందంటే.. 


‘‘చెరువులు ఆక్రమణలు కూల్చివేడయం మంచి నిర్ణయమే. కానీ పెద్ద భవనాలు వరకూ ఓకే. కానీ చిన్న ఇళ్లు నిర్మించుకుని గత ఇరవై ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న కుటుంబాల పరిస్దితి ప్రభుత్వం ఆలోచన చేయాలి. తెలంగాణ రాకముందు ఉన్న పేదవారి ఇళ్లను వదిలేయాలి. రాష్ట్రం ఏర్పాటు తరువాత ఏర్పడ్డ కట్టడాలను టార్గెట్ చేస్తే బాగుంటుంది. గుడిసెల్లో జీవించేవారు ఇళ్లు కూలిపోతే రోడ్డున పడతారు. వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. రాజకీయ కక్షతో చేస్తున్నట్లు ఎక్కడా అనిపించడం లేదు. జనం ప్రయోజనం కోసమే హైడ్రా అనిపిస్తుంది. వరద ముంపు సమస్య ఉండదు’’ - వెంకటేశ్వరరావు, హైదరాబాద్.


‘‘హైడ్రా పనితీరు అద్భుతంగా ఉంది. ఇది తప్పుదోవ పట్టకుండా చూడాలి. తెలంగాణకు చెరువులు జీవనాధారం. చెరువులు లేనిదే తెలంగాణ లేదు. కాబట్టి చెరువులు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎటువంటి రాజకీయాలకు తావులేకుండా ఇలాగే కొనసాగించాలి. ఏకపక్షంగా వెళుతున్నాడా.. లేదా అని ఇప్పడే చెప్పలేం. ప్రతి ఒక్కరూ హైడ్రా పనులను గమనిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అవినీతికి లొంగకుండా ఇలా ముందుకు వెళతారా.. లేదా అనేది ముందు ముందు చూడాలి’’ - క్రిష్ణ, నగరవాసి


‘‘హైదరాబాద్ లో కాస్త వర్షం పడితే చాలు రోడ్లు నీటితో నిండిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. నాళాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాల వల్లనే వరద ముంపు నగరంలో విపరీతంగా పెరిగింది. ఆక్రమించిన వాళ్లకు కూల్చేస్తుంటే కోపం రావడం సహజం. విమర్శలు హైడ్రా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని కోరుతున్నాము. నాగార్జున వంటి హీరో ఆక్రమణలే కూల్చేశారంటే పారదర్శకంగా ముందుకు వెళ్లున్నారు అనిపిస్తోంది. ఎవరికి భయపడకుండా రంగనాధ్ ధైర్యంగా ముందుకు వెళ్తుండటం మంచి పరిణామం’’ - అమ్జాద్


‘‘హైడ్రా యాక్షన్ చాలా బాగుంది. రాజకీయాలు అంటేనే విమర్శలు సహజం. ఇది డేరింగ్ నిర్ణయం. ప్రజల మద్దతు కచ్చితంగా ఉంది. హైడ్రా దూకుడు చూస్తుంటే ఇలా కొనసాగిస్తుందనే అనుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేయాంటే భయపడుతున్నారు. భవిష్యత్ లో కూడా ఆక్రమణలకు ఎవరూ పూనుకోరు. చెరువులను పూడి ఇళ్లు కట్టుకుంటే భవిష్యత్ లో అది పేదవారికైనా, సెలబ్రెటీలకైనా ఎవరికైనా ప్రమాదమే. ఆక్రమణదారులు ఎవరైనా చర్యలు తీసుకోవడం తప్పులేదు.


సీఏం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికే హైడ్రా నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడుి ఆక్రమణలే మొదట కూల్చేసింది. కాపాడుకోవాలి అంటే సొంత పార్టీ నేతలను ఎవరూ టార్గెట్ చేయరుకదా. మొదట్లో హైడ్రా ఏం చేస్తుందిలే అనుకున్నారు ఆక్రమణదారులు. ఇప్పడు గుండెల్లో హడల్ పుడుతుంది.


ఇనాళ్లు ప్రభుత్వ నిర్ణయాలతో పేదవాళ్లే దెబ్బతింటారు. అనే అభిప్రాయాం అందరిలో ఉండేది. ఇప్పడు హైడ్రా చర్యలు తీసుకుంటున్న విధానం చూస్తుంటే పేదలు, పెద్దవాళ్లు అంతా ఒకటే అనే భావన కలుగుతోంది’’ అని ప్రజలు చెబుతున్నారు.