హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ కు బెయిల్ వచ్చింది. పోలీసులు శనివారం నాడు నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టు లో ప్రవేశపెట్టారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు శివరాం రాథోడ్ రిమాండ్ కు అనుమతించింది. కానీ ప్రవళిక ఆత్మహత్య కేసులో సరైన సాక్షాధాలు లేనందున నాంపల్లి కోర్టు నిందితుడు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తుతో శివరాంను విడిచి పెట్టాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. 


తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు శివరాంను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన శివరాం సరెండర్ పిటిషన్ వేశాడు. ప్రవళిక ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఉందని, కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా రిమాండ్ విధించలేమంటూ శివరాం వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అనంతరం పోలీసులు నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే శివరాంను అరెస్ట్ చేయడం తెలిసిందే. 


పెళ్లి చేసుకుంటానని శివరాం నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో ప్రవళిక ఆత్మహత్య విషయంపై శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో శివరాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 


ప్రవళిక తల్లి ఏమన్నారంటే..
ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లి విజయ స్పందించారు. శివరాం అనే యువకుడి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు వాపోయారు. 'నా కుమారుడు,  కుమార్తె రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటూ చదువుకుంటున్నారు. కాయ కష్టం చేసి కష్టపడి కోచింగ్ ఇప్పించాం. అయితే, ప్రవళికను శివరాం ప్రేమ పేరుతో వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిందితున్ని కఠినంగా శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వారికి రాకూడదు. బిడ్డ పోయిన బాధలో ఉన్నాం. రాజకీయాలుంటే మీరు మీరూ చూసుకోండి. అంతే తప్ప మా కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు.' అంటూ ఆమె వాపోయారు.


అసలేం జరిగిందంటే ?
వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవలిక (23) హైదరాబాద్ అశోక్ నగర్ హాస్టల్‌లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 13న ఆమె తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, సర్కారుపై విమర్శలు చేశారు. 
పోలీసులు ఏం చెప్పారంటే.?
రంగంలోకి దిగిన  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రకటించారు. ఫోన్, వాట్సాప్, స్నేహితులను విచారించిన అనంతరం ప్రవళిక ప్రియుడు ఆమెను కాదని మరో యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీపీ యాదగిరి తెలిపారు.