ఈనెల 26న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School Of Businees) వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ట్రానికి రానుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరుతుందని కాషాయ పార్టీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. 


తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు.  ఇప్పటికే బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ కావడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో రాష్ట్ర పార్టీ నేతలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా ప్రధాని మోదీ హైదరాబాద్‌ (PM Modi Telangana Tour)కు రానున్నారన్న సమాచారంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.


ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు
ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకాలని తెలంగాణ బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రధాని రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయవంతం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో మోదీకి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కనీవినీ ఎరగని రీతిలో ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఒకరి తరువాత ఒకరు తెలంగాణకు వస్తుండటంతో కాషాయ శ్రేణులు జోరు పెంచాయి.