Betting Apps Promotion Case | హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో అమాకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ఈడీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. కొన్ని నెలల కిందట ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్ల ప్రమోషన్ వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటి నిధి అగర్వాల్ను హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు బుధవారం విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా జరిగిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ నోటీసులు జారీ చేయడంతో నిధి అగర్వాల్ విచారణకు హాజరయ్యారు.
ఈ విచారణలో బెట్టింగ్ ప్లాట్ఫామ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రమోషన్ చేసినందుకు పొందిన పారితోషికం, కంపెనీలతో జరిగిన ఆర్థిక లావాదేవీల తీరుతెన్నులపై ఈడీ అధికారులు నిధి అగర్వాల్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ చెల్లింపులు హవాలా రూపంలో జరిగాయా అనే కోణంలోనూ నటిని ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దాదాపు 21 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో తెలంగాణ సీఐడీకి స్టేట్మెంచ్ ఇచ్చిన నిధి అగర్వాల్ను, ఇప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ విచారించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రయోషన్ల కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.
తెలుగు సినీ పరిశ్రమలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసి ఈడీ, పోలీసుల నోటీసులు ఎదుర్కొన్న జాబితాలో నటి నిధి అగర్వాల్ ఒక్కరే కారు. గతంలో ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులలో టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖ నటులు విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా పలువురు నటులు కూడా పలు బెట్టింగ్ లేదా గేమింగ్ యాప్ల ప్రచారాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందుకున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల్లో సోసల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు నోటీసులు రావడంతో విచారణకు హాజరయ్యారు. నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సైతం బాధ్యతాయుతంగా ఉండాలని అధికారులు సూచించారు.
