GHMC News: హైదరాబాద్‌లో ఎక్కడి పడితే అక్కడ చెత్త వేసే సంస్కృతిని శాశ్వతంగా పరిష్కారించే దిశగా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పడికే ప్రతి ఇంటికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారం చెత్త సేకరణ జరుగుతోందో లేదో అన్న ట్రాకింగ్ చేయనుంది. దీంతోపాటు కాలనీల్లో ఎక్కడైనా అనవసరంగా చెత్త వేస్తే మాత్రం సైరన్ మోగేలా కొత్త విధానం తీసుకురానున్నారు. 


ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆయా వెల్ఫేర్ కమిటీలతో మాట్లాడుతున్నారు. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు అయిన తర్వాత దాన్ని కొత్త టెక్నాలజీకి అనుసంధానిస్తారు. లిట్టర్ కంట్రోల్ కాషన్ కెమెరాలు , ఆ పక్కనే మైక్ ఏర్పాటు చేయనున్నారు. దాని వల్ల ఎక్కడైనా అనుమతి లేని ప్రాంతాల్లో చెత్త వేస్తే సైరన్ మోగనుంది. ప్రస్తుతం ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఈ కొత్త టెక్నాలజీ అమలు చేస్తున్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. 






పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అధికారులు గుర్తు చేస్తున్నారు. దాన్ని మర్చిపోయి కొందరు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారని ఇలాంటి వారికి చెక్ పెట్టి నగరాన్ని గార్బేజ్‌ నుంచి శాశ్వత పరిష్కారించేలా టెక్నాలజీ పని చేస్తుందంటున్నారు అధికారులు. ఈ వివరాలను జీహెచ్ఎంసీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకుంచింది. 


గతంలో హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో చెత్త డబ్బాలు ఉండేవి. అయితే ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నప్పుడు వాటితో పనేంటి అని వాటిని అధికారులు తొలగించారు. వాటినితొలగించినప్పటికీ చాలా మంది ఆ ప్రాంతంలో చెత్త పడేస్తుంటారు. ఎక్కడ వేయాలో తెలియదని గతంలో ఇక్కడ చెత్త డబ్బా ఉండేదని దాన్ని అధికారులు తీసేశారని చెబుతుంటారు. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. అందుకే దీని పరిష్కారానికి అధికారులు సాంకేతికతను నమ్ముకున్నారు. ప్రస్తుతానికి ఒకట్రెండు ప్రాంతాల్లో అమలు అవుతున్న ఈ వ్యవస్థ విజయవంతంగా అమలు అయితే నగరమంతా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.