నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న ఓ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కార్ లో నుంచి మంటలు మొదలై నిమిషాల్లో వ్యాపించినట్లుగా సమాచారం. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, అబిడ్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అగ్ని ప్రమాదం జరగడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వీకెండ్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది.


హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా సందర్శకుల తాకిడి పెరిగింది. పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ ను రోజూ వేల సంఖ్యలో సందర్శిస్తున్నట్లు బుకింగ్ కిమిటీ ఛైర్మన్ హన్మంత్ తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేసినట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్ కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. 


2019లోనూ నుమాయిష్ లో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో స్టాళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించారు.


జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన నుమాయిష్ 
ప్రతీ ఏటా ఎంతో గ్రాండ్ గా నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన ఈ నుమాయిష్.. 46 రోజుల పాటు సందడిగా సాగనుంది. అయితే ఈ ఎగ్జిబిషన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలి, ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతీ రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకూ ఎగ్జిబిష్ గ్రౌండ్‌లోకి  సందర్మకులను అనుమతిస్తారు. టికెట్ ధరను ఈసారి పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.30 ఉంటే ఈసారి నుంచి 40 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 దాటాక ఎగ్జిబిషన్ లోపలకు సందర్మకులను అనుమతిస్తే, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 600 రూపాయలు చెల్లించి నేరుగా కారులో లోపలికి వెళ్లి నుమాయిష్ చుట్టివచ్చే విధంగా ఈసారి అవకాశం కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. 


82వ నుమాయిష్..
ఈ ఏడాది 82వ నుమాయిష్ ను నిర్వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడకు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ (నుమాయిష్‌) ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ కు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విజిటర్స్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.