జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు కోర్టు 3 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు ఏ - 1 అయిన సాదుద్దీన్ అనే వ్యక్తిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని విచారణ చేయనున్నారు. 3 రోజుల కస్టడీ రేపటి నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా సాదుద్దీన్ ఉన్నాడు. మరో ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నారు.


జువైనల్ కోర్టులోనూ పిటిషన్ దాఖలు
బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో సాదుద్దీన్ అనే ప్రధాన నిందితుడికి 18 ఏళ్లు. మిగతా వారు 18 ఏళ్ల లోపు వారు. ఈ మైనర్లను కూడా తమ కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు పోలీసులు జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దాని విచారణ జరగాల్సి ఉంది. ఏ-1 అయిన సాదుద్దీన్ కు ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరినా, కోర్టు మూడు రోజుల అనుమతే ఇచ్చింది. 


ఫిర్యాదు అందినప్పటి నుంచి ఇప్పటిదాకా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. అయినా ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ఆ నేరం చేసేలా ఇతర మైనర్లను ఎలా ప్రోత్సహించాడు, అసలు ప్రోత్సహించాడా లేదా అనే కోణంలో పోలీసులు ఇకపై ఆరా తీయనున్నారు. ఈ మూడు రోజుల విచారణ పూర్తి కాగానే, నాలుగో రోజు మళ్లీ సాదుద్దీన్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్కడి నుంచి రిమాండ్‌కు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.


అత్యాచార ఘటన ఎలా జరిగిందంటే ?


మే 28వ తేదీన బెంగళూరుకు చెందిన ఒకబాబు హైదరాబాద్‌ ఇన్‌సోమ్నియా పబ్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి బాధితురాలైన బాలిక కూడా రూ. 1300 ఎంట్రీ ఫీజు కట్టి హాజరయింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలికపబ్‌కు చేరుకుంది. పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో నిందితులు ఇతర అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ కారణంగా బాలిక బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో బాలికను ట్రాప్ చేసిన నిందితులు బేకరికీ తీసుకెళ్లారు. బేకరీకి తీసుకెళ్లే సమయంలో మెర్సిడెస్ బెంజ్ కారులో ఉన్న నలుగురు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత ఆ బాలిక ఇన్నోవా కారులోకి మారింది. అక్కడ్నుంచి జూబ్లిహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకి కారును తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఐదుగురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.  తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి పబ్ వద్ద వదిలి పెట్టారు. బాలిక ఆ తర్వాత తన తండ్రికి ఫోన్  చేసిందని  సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 


ఒక్కరినే గుర్తు పడుతున్న బాధితురాలు !


ఘటన 28వ తేదీన జరగితే మూడు రోజుల పాటు బాలిక ఎవరికీ విషయం చెప్పలేదని కమిషనర్ తెలిపారు. బాలిక తల్లికి అనుమానం రావడంతో మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్నారు. బాలిక ఇప్పటికీ అందర్నీ గుర్తించలేకపోతోందని.. ఒక్కరిని మాత్రమే గుర్తిస్తోందని.. తెలిపారు. 


పూర్తి సాక్ష్యాలను సేకరించామన్న సీపీ !


జరిగిన గ్యాంగ్ రేప్‌ ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని సీపీ ప్రకటించారు. దర్యాప్తుతో కాస్త జాప్యం జరిగిన మాట నిజమే అయినప్పటికీ  అన్నీ ఆధారాలు పక్కాగా సేకరించామన్నారు. ఆధారాలు లేకుండా ఎవరినీ బుక్ చేయలేమని.. తాము కోర్టుకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారని సీపీ ఆనంద్ తెలిపారు. అందరిపై గ్యాంగ్ రేప్, పోక్సో కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.