Food Poison for Students In Nagarkurnool District | నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి కలుషితాహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల ఫుడ్ పాయిజన్
నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 111 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల హాస్టళ్లలో సంఘటనలు జరగడం చాలా బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు వస్తున్న విషయం తెలుసుకొని హడావుడిగా పిల్లలను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. కొందరు విద్యార్థులకు చేతికి క్యాండిల్ తోనే చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి చికిత్స అందిస్తున్నారు.
పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా, వారికి సరైన వైద్యం అందించకుండా అధికారులు ఎందుకు హడావిడిగా తీసుకొచ్చారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోనే మొన్న పెద్దకొత్తపల్లి హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెంలలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలయ్యారు. హుస్నాబాద్ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకలు కొరికి విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. ఏదోచోట గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆసుపత్రుల్లో చేరుతున్న వార్తలు చూడాల్సి వస్తోంది.
100 మంది విద్యార్థులు చనిపోయినా స్పందించని సీఎం
20 నెలల సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వందమంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. 100 మంది చనిపోయినా మీ గుండె కరగదా రేవంత్ రెడ్డి. గురుకుల విద్యార్థుల గురించి పట్టించుకోవా? ఈ విద్యార్థుల భవిష్యత్తుపైన మీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడం ఈ ప్రభుత్వానికి చేతకాదా. బాలల దినోత్సవం నాడు ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అయితే అధికారులను సస్పెండ్ చేస్తా అని రేవంత్ రెడ్డి ప్రగల్బాలు పలికాడు. నువ్వే విద్యాశాఖ మంత్రివి. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే కూడా స్పందించవా..
అందాల పోటీల్లో లక్షకు ప్లేట్ భోజనం.. మరి గురుకులాల్లో పరుగుల అన్నం
అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టావు.. అందాల భామలను చూడడానికి ఐదుసార్లు పోయావు. మరి అనారోగ్యానికి గురైన ఈ పిల్లలను చూడడానికి ఆసుపత్రికి రావడం లేదు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఆసుపత్రి పాలైతుంటే వాళ్ళని పరామర్శించాలని రేవంత్ రెడ్డికి ఎందుకు అనిపించదు. కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే ఏమిటి. ఆనవాళ్లు మార్చడం అంటే విద్యార్థులు గురుకుల నుండి టీసీలు తీసుకుని వెళ్లిపోవడమా.. ? ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల పిల్లలను ఆసుపత్రి పాలు చేయడమా? 284 గా ఉన్న గురుకులాలను KCR 1,023 గురుకులాలకు పెంచిండు. 1,60,000 మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్ ఆరు లక్షల మంది విద్యార్థులు చదివే సౌకర్యాలు కల్పించారు.
రేవంత్ రెడ్డి గురుకులాలను ఆగం చేశాడు.. ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడతా అని డబ్బా కొట్టిన రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టింది లేదు. ఒక స్కూల్ కట్టింది లేదు. ఉన్న గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఏడిపించే పరిస్థితి ఉంది. ఒక విద్యార్థిని తల్లి రూప అనే మహిళ నన్ను కలిశారు. వారు బండై గుట్ట గ్రామం కొల్లాపూర్ నుంచి వచ్చారు. నిన్న వారి బిడ్డ కలుషిత ఆహారం తిని ఆసుపత్రిపాలైందని తెలిసి వచ్చింది. ఆదివారం రోజు విద్యార్థులకు పెట్టవలసింది పూరి, చపాతి. కానీ ఉదయం పెట్టింది సాంబారు అన్నం. ఆ సాంబార్లో కూడా పురుగులు వచ్చాయని ఆ తల్లి స్వయంగా చూసి చెప్పింది.
గురుకులాల్లో మెనూ కూడా ఈ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రతీరోజు ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అన్ని జిల్లాలో రోజుకి 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన.. ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేసి వారి జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నాడు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి. బీఆర్ఎస్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకోదు. మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.
సమగ్ర విచారణ జరపాలని హరీష్ రావు రిక్వెస్ట్
హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు సుమోటోగా తీసుకొని రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ లో జరుగుతున్న సంఘటనలపై విచారణ చేయాలి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాము.. సుమోటో గా కేసు తీసుకోండి.. బీసీ హాస్టల్లో ఇంకా బెడ్ షీట్స్ రాలేదు. కాస్మోటిక్ బిల్లులు రాలేదు. కొన్ని హాస్టల్లో ఇంకా విద్యార్థులకు బట్టలు కూడా రాలేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు.