సికింద్రాబాద్: భర్త వీర్యానికి బదులు వేరే వ్యక్తి వీర్యంతో ఐవీఎఫ్​ చేసిన సికింద్రాబాద్ రెజిమెంటల్​బజార్​లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్ట్​ చేశారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నట్టు దర్యాప్తులో తేల్చారు. ఐవీఎఫ్​ ద్వారా పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించడంతో తమ బిడ్డ కాదని తేలగా రాజస్థాన్​కు చెందిన భార్యాభర్తలు శనివారం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇండియన్ స్పెర్టెక్ సంస్థ రీజినల్ మేనేజర్ అరెస్ట్​..దంపతుల ఫిర్యాదు మేరకు ఐవీఎఫ్​ సెంటర్​పై కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యాధికారులతో కలిసి శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించారు. వైద్యాధికారులు పలు కీలక డాక్యుమెంట్స్​తోపాటు వీర్య కణాల శాంపిల్స్ తీసుకెళ్లారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్నారని.. వీర్యకణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్​లో ఇండియన్ స్పెర్టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు విచారణలో తేల్చారు. దీంతో ఆ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. పంకజ్​తోపాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరో అనే వ్యక్తులను అరెస్టు చేశారు.

రూ.30 లక్షలతో ఐవీఎఫ్​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్​కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్​లో ఉంటున్నారు. వివాహం జరిగి ఏడేళ్లు వుతున్నా సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్​ బజార్​లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి తెలియజేశారు. ఈ ప్రక్రియ మొత్తానికి రూ.30 లక్షలు అవుతుందని చెప్పడంతో ఆ దంపతులు అంగీకరించారు. గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు కూడా చెల్లించారు.

డీఎన్ఏ టెస్ట్​ చేయించడంతో విషయం వెలుగులోకి..అయితే ఈ ప్రక్రియపై పూర్తి నమ్మకం లేని సదరు దంపుతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ డీఎన్ఏ నమూనాలు సేకరించి.. పోల్చాలని షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డీఎన్ఏ పరీక్షలు చేయించాలని డాక్టర్​ నమ్రతను కోరారు. అయితే ఆమె తరచూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అనుమానం వచ్చిన దంపతులు బాలుడికి దిల్లీలో డీఎన్ఏ పరీక్షలు చేయించారు. కానీ తల్లిదండ్రుల డీఎన్ఏతో బిడ్డ డీఎన్ఏ సరిపోలేదు. 

తప్పును అంగీకరించిన డాక్టర్​ నమ్రతఈ జూన్ రెండోవారంలో డాక్టర్​ నమ్రతను దంపతులు మళ్లీ సంప్రదించారు. బిడ్డ తమకు జన్మించలేదని.. బాలుడి తల్లిదండ్రులకు ఇవ్వాలని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో తప్పును అంగీకరించిన డాక్టర్​.. సమస్యను పరిష్కరించేందుకు టైమ్​ ఇవ్వాలని అడిగారు. కానీ తర్వాత నుంచి వారికి అందుబాటులో లేకుండా పోయారు. మోసపోయామని భావించి దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. శనివారం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్​లో తనిఖీలు చేసి నమ్రతతోపాటు మరికొందరిని అరెస్ట్​ చేశారు.