YS Avinash Reddys Mother: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరుకాకుండా తల్లి వద్దే ఉంటూ బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన విచారణకు రావాలని పలుమార్లు సీబీఐ కోరినా.. ఆయన మాత్రం తల్లి అనారోగ్యం కారణంగా రాలేనని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొంటూ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ఆమెను డిశ్చార్జ్ చేసింది. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆమెను డిశ్చార్జ్ అనంతరం శ్రీలక్ష్మిని మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఎంపీ అవినాష్ రెడ్డి తన తల్లిని తీసుకుని ఏఐజీకి వెళ్లారు. 


మే 19న కర్నూలు విశ్వభారతికి తరలింపు


మే 19న ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు అవినాష్ రెడ్డి. అదే సమయంలో తల్లి అనారోగ్యంతో బాగాలేదని పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం తెలుసుకున్న అవినాష్‌.. హైదరాబాద్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు. అవినాష్ తల్లి పరిస్థితి సీరియస్‌గా ఉందని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో పరిస్థితి మరింత సీరియస్‌ గా ఉందని కర్నూలుకు తరలించారు. అక్కడే వారం రోజుల పాటు చికిత్స అందించారు. ఈ వారంలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. అవినాష్‌కు సోమవారం విచారణకు సీబీఐ పిలిచింది. అయితే తన తల్లి ఆరోగ్యం బాగాలేనందున 27వ తేదీ వరకు తాను రాలేనని చెప్పేశారు అవినాష్‌. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పై నిరాశే ఎదురైంది. దీంతో ఆయన అరెస్టు ఖాయమంటూ వార్తలు వచ్చాయి. సీబీఐ అధికారులు కూడా కర్నూలు వెళ్లారు. పోలీసు అధికారులతో మాట్లాడి అవినాష్ లొంగిపోయేలా ప్రయత్నాలు చేశారు. అయినా అవేవీ సాధ్యపడలేదు. 


సీబీఐ అధికారులు కర్నూలు వరకూ వచ్చారు. తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయారు. విచారణకు సహకరించకపోతుండటంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తీర్పును బట్టి సీబీఐ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంతలో శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసి హైదరాబాద్ తరలించారు. 


Also Read: Avinash Reddy: నేడు విచారణకు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌, కోర్టు నిర్ణయంపై ఆసక్తి


హైకోర్టు వెకేషన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు 


అవినాష్ రెడ్డి ముంందస్తు బెయిల్ పిటిషన్‌‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపి  ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని రెండు రోజుల కిందట ఆదేశించింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవినాష్ రెడ్డి తన పిటిషన్‌లో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు విచారణ జరిపే వరకు కస్టడీ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి పరిష్కరించే వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.