Azadi Ka Amrit Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేరళ అసెంబ్లీ నిర్వహించనున్న జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 25 నుంచి 27 వరకూ తిరువనంతపురంలో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందులో భాగంగా ఈ నెల 26 న నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం అనే అంశంపై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు అదే అంశంపై ఉత్తరాఖండ్ అసెంబ్లీ గవర్నర్ రీటా ఖండూరీ, అన్నీ రాజా (Annie Raja) సైతం ప్రసంగించనున్నారు‌. ఈ కార్యక్రమానికి మోడరేటర్ గా  కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.


ఈ నెల 25 నుంచి 27 వరకు తిరువనంతపురంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. డెసిషన్ మేకింగ్ బాడీస్ లో మహిళల ప్రాతినిథ్యం అనే అంశంపై ఎమ్మెల్సీ కవిత ప్రసంగించనున్నారు.


కేంద్రంపై కవిత ఆగ్రహం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ నాయకుల హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా కవిత తనదైన శైలిలో ప్రశ్నిస్తుంటారు. భారీ ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయి నిరుద్యోగిత రేటుతో ప్రస్తుత పరిస్థితిని ఎత్తిచూపుతూ ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీజేపీ పాల‌నలో దేశం పురోగ‌తి వెన‌క్కివెళ్తుంద‌ని విమ‌ర్శించారు.


కొద్ది రోజుల క్రితం కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్‌ పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లు సిండికేట్‌గా పనిచేసి రైతుల ప్రాథమిక హక్కులను హరించేలా పని చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర రైతులు, ప్రజల అభివృద్దికి టీఆర్ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని క‌విత అన్నారు. పసుపు రైతులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసిందేమీ లేద‌ని అన్నారు. రాష్ట్ర రైతులు, ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండగా పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ‌కు న్యాయంగా ద‌క్కాల్సిన రూ.3 వేల కోట్ల విలువైన ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్‌ల బకాయిలు, రూ.1,350 కోట్ల వెనుకబడిన ప్రాంత గ్రాంట్ల నిధులు, రూ.2,247 కోట్ల జీఎస్టీ పరిహారాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు.