హైద‌రాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా ప్రతిష్ఠిస్తామ‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీవీ మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా ప‌నుల‌ను కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో క‌లిసి ప‌రిశీలించారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ‌త 8 నెల‌లుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ప‌నులు ముమ్మరంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ప‌నుల‌ను ఎప్పటిక‌ప్పుడు స‌మీక్ష చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు దేశానికే త‌ల‌మానికంగా నిల‌వ‌నున్నదని అన్నారు. ప‌ర్యాట‌క రంగాన్ని ఆక‌ర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామ‌న్నారు. దీంతో ప‌ర్యాట‌క రంగం పుంజుకుంటుంద‌ని తెలిపారు. అంబేద్కర్ ఆశ‌యాల‌ను సీఎం కేసీఆర్ కొన‌సాగిస్తున్నార‌ని చెప్పారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ సాధ్యమైంద‌ని మంత్రి స్పష్టం చేశారు. 







‘‘ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం 55 అడుగులు బేస్, 125 అడుగులు విగ్రహం రెడీ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ కి విగ్రహం పని పూర్తి అవుతుంది. భారత దేశ ప్రజలకి ఈ ప్రాంతం స్ఫూర్తి కాబోతోంది. తెలంగాణ ప్రయోజనాలకి ఎక్కడా భంగం కలిగకుండా అంబేద్కర్ బాటలో నడుస్తున్నాం. రామేశ్వరంలో ఉన్న అబ్దుల్ కలాం, ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాంతాలను సందర్శించి విగ్రహ నిర్మాణం చేపడతాము. దేశ ప్రజలకు ఇదొక కానుక’’ అని కేటీఆర్ అన్నారు.