Malla Reddy: దొంగకు పీసీసీ ఇస్తరా? రైతుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తం - మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ABP Desam   |  12 Jul 2023 05:45 PM (IST)

రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధమైన పదాలు వాడుతూ దూషించారు.

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రైతులకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి నిరసనగా నేడు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పోరు తీవ్ర తరం చేసింది. మంగళవారం పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండించగా, నేడు (జూలై 12) రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేశారు.

ఈ నిరసనల్లో రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధమైన పదాలు వాడుతూ దూషించారు. రేవంత్ రెడ్డి తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుందంటూ ఎద్దేవా చేశారు. ఒక దొంగకు పీసీసీ పదవి ఇచ్చారంటూ మాట్లాడారు.

రేవంత్ రెడ్డి నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేసిండు.. మీ అందరికి ఎర్కనే. తెలుగు దేశంలోకి పోయిండు దాన్ని నాశనం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు, దాన్ని కూడా నాశనం చేసి పోతడు. ఏం మాట్లాడతడో అర్థం కాదు. పాపం 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ.. ఒక దొంగకు పీసీసీ ఇస్తరా? ఇంత దరిద్రం ఎక్కడా లేదు. వాళ్లకి ఎవరూ దిక్కులేడు. దివాళా తీసేటప్పుడు ఏం చేస్తరు? ఏవడ్నో పెట్టి నడిపియ్యాల. వీడేమో పైసలు లూటీ చేసి నడిపిస్తడు. కాబట్టి, మా రైతుల గురించి ఎవరన్నా మాట్లాడిన్రనుకో వాళ్ల నాలుక చీరతం. తెలంగాణకు రానియ్యం. మీకు పుట్టగతులు ఉండవ్. మా రైతులు అంత కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునే ఉన్నరు. మిమ్మల్ని తరిమి తరిమి కొడతరు ఊళ్లలోకి పోతే-

Published at: 12 Jul 2023 05:45 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.