KTR Latest Tweet: ఎనిమిదేళ్ల పాలనతో తెలంగాణ సీఎం కేసీఆర్ 16 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. వైద్య విద్యలో ఆయన గొప్ప చరిత్ర సృష్టించారని వివరించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కావచ్చిందని స్పష్టం చేశారు. ఇక వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 






అలాగే గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందో ప్రధాని  నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గత 67 కాలంలో కేవలం తెలంగాణలో కేవలం ఐదు ప్రభుత్వ కళాశాలలు మాత్రమే ఏర్పాటు అయ్యాయని తెలిపారు.






రాష్ట్రంలో మదవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపాటు..! 


హైదరాబాద్ లో బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోటీ పరీక్ష స్టడీ మెటిరీయల్ ను విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ ప్రపంచం ముందు విశ్వగురు అని బిల్డప్ ఇచ్చినా.. ఇంకా పేదదేశంగానే ఉన్నామన్నారు. ఓ పూటకు తిండి లేక చనిపోతున్న మనుషులు మన మధ్యలో ఉన్నందుకు సిగ్గుపడదామన్నారు. ఉచితాలపై కామెంట్లు చేస్తున్న మేధావులు ఈ అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో మ‌త విద్వేషాల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌రోక్షంగా విమ‌ర్శలు చేశారు.  త‌న్నుకు చావండ‌ని అని ఏ దేవుడు చెప్పిండు.. అంటూ  మండిపడ్డారు.  


 ఎవరి దేవుడు గొప్ప అనే ప్రశ్నకు అర్థమే లేదు..!


స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా...ఎవరు ఎలా బతకాలో... ఏం తినాలో.. ఏం వినాలో... ప్రజల మీద రుద్దటం దారుణమని మంత్రి కేటీఆర్ అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాట్లాడిన కేటీఆర్ ఎవరి దేవుడు గొప్ప అనే కొట్లాటలో అసలు లాజిక్ ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా పరిపాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు.  ఎందుకు కొట్లాడుతున్నాం, ఎవ‌రి కోసం కొట్లాడుతున్నాం, ఏ కార‌ణం చేత కొట్లాడుతున్నాం అనే విషయంపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో నీళ్లు లేవ‌ని ఒక‌రు ఏడుస్తుంటే, తిండి లేక చ‌స్తుంటే, రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము స్వగ్రామానికి  మొన్ననే క‌రెంట్ వ‌స్తే.. దానిపై  మ‌న‌కు సోయి లేదన్నారు. ఏ దేవుడు గొప్ప? అని ప్రశ్నించుకుంటున్నారన్నారు. తనను అడిగితే  అమ్మ గొప్ప అని చెబుతానన్నారు. ఎవ‌రి దేవుడు గొప్ప అనే ప్రశ్నకు అర్థం లేదన్నారు. 


5 శాతం జీడీపీ ఇస్తోంది తెలంగాణ..!


మ‌త విద్వేషాలతో ఎక్కడికో పోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ  16 ట్రిలియ‌న్ డాల‌ర్లకు చేరితే, భారత్ 3.1 ట్రిలియ‌న డాల‌ర్ల వ‌ద్దనే ఆగిపోయిందన్నారు. ఇది సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి కాదా అని ప్రశ్నించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇందుకు భిన్నంగా ప‌ని చేస్తుందన్నారు. గ‌త 8 ఏళ్లలో సాధించిన విజ‌యాలు, నిధుల విష‌యంలో ఒక్క మాట చెప్పొచ్చన్నారు.  140 కోట్ల భార‌త‌దేశ జ‌నాభాలో కేవ‌లం 4 కోట్లు మాత్రమే ఉన్న తెలంగాణ దేశానికి 5 శాతం జీడీపీ కంట్రిబ్యూట్ చేస్తుందన్నారు. అభివృద్ధి అంటే ఇలా  ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు.