Minister KTR Speech: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని కెప్టెన్ అమరీందర్ సింగ్ సోనియాకు లేఖ రాశారన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవని అన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా కావాలంటే ఇంకా అభివృద్ది చేయాలని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజల కోసం బస్తీ దవాఖానాలు, అన్నపూర్ణ క్యాంటీన్లు  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రసూతి కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే కేసీఆర్ కిట్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లల్లో సన్నబియ్యంతో ఆహారం అందిస్తున్నామని, రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్ అందజేస్తామని కేటీఆర్ తెలిపారు.


హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 'రాజకీయాల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉన్న నాయకుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఐటీ వృద్ది రేటులో బెంగళూరును మనం దాటిపోయాం. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. నగరానికి నాలుగు పక్కల కొత్త ఆస్పత్రులు కడుతున్నాం. బీజేపీ వాళ్లు నీటి వాటా తేల్చరు.. కాంగ్రెసోళ్లు కేసులేసి ఇబ్బంది పెడతారు. మేం తెలంగాణ ప్రజలకు A టీమ్‌గా ఉంటాం. గెలిసిన కాంగ్రెసోళ్లు బీజేపీలోకి జంప్ అవుతారు. 15 లక్షలు మోదీ ఇస్తా అన్నాడు.. కానీ అంతా దోచి ఆయన దోస్తు అదానీకి కట్టబెట్టాడు' అని ఆరోపించారు.


'సూపర్ స్టార్ రజనీకాంత్ సింగపూర్‌లా హైదరాబాద్ కనిపించిందని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా హైదరాబాద్ అభివృద్ది వాస్తవం. 40 శాతం మందులు, వ్యాక్సిన్లు మూడో వంతు మన దగ్గర తయారు అవుతున్నాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకోవాలి.. అందుకే కమిట్మెంట్‌తో పనిచేస్తున్నాం. రూ.450 ఉన్నప్పుడు మోదీ సిలిండర్ ధరల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఏమో ఎన్నికల కోసం తగ్గిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ డ్రామా ఆడుతున్నారు' అని కేటీఆర్ అన్నారు.  


'కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో మంచినీటికి ఎంతో ఇబ్బంది ఉండేది.. ప్రస్తుతం 2050 వరకు పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య లేకుండా చేశాము. ప్రస్తుతం రోజు విడిచి రోజు మంచి నీరు ఇస్తున్నాం. రాబోయే రోజులలో  హైదరాబాద్‌లో 24 గంటలు మంచినీటి సరఫరా చేసేలా కృషి చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ కార్పెట్‌తో ఇండస్ట్రీస్‌ని వెల్కమ్ చేస్తున్నాము. హైదరాబాద్‌లో ఐటీ రంగం 3 శాతం పెరిగింది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మందులలో 40 శాతం మన హైదరాబాద్ నుండే ఉత్పత్తి అవుతున్నాయి. విద్యా రంగంలో గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విద్యను అందజేస్తున్నాం. రాష్ట్రంలో 1000 కోట్లతో ప్రారంభించిన స్ట్రాటజిక్ నాళా డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మరో 500 కోట్లను త్వరలో విడుదల చేస్తాం. 9 వందల 30 వేల కోట్లతో కూకట్ పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి  పనులు ఎమ్మెల్యే చేయడం జరిగింది' అని కేటీఆర్ పేర్కొన్నారు.