Minister KTR: తెలంగాణలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఉద్ఘాటించారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జీవో నెం. 118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు రాజకీయాలు చేస్తే సరిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మిగతా నాలుగున్నర సంవత్సరాల పాటు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చారు. 


ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో


సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా లాభం  జరిగే పథకాలు మాత్రమే కాదని, హైదరాబాద్ విస్తరణను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న 50 నుంచి 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు, మెట్రో నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 70 కిలోమీటర్ల మెట్రో మార్గం, పనులు జరుగుతున్న ఎయిర్ పోర్టు మెట్రో మార్గం 31 కిలోమీటర్లతో పాటు మరో 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగోలు నుంచి ఎల్బీనగర్ మార్గాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా ఓఆర్ఆర్ దాకా మెట్రోను తీసుకెళ్తామన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ 159 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


కేసీఆర్ చెబితే ముందు నమ్మలేదు


కేసీఆర్ తన విజన్ తో, ముందు చూపుతో, అభివృద్ధి కాంక్షతో చేపట్టే ఏ పనులైనా ముందు నమ్మశక్యంగా ఉండవన్నారు. ఆ తర్వాత అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ సాధిస్తానని ఆనాడు కేసీఆర్ చెబితే ఎవరూ నమ్మలేదని, కానీ తెలంగాణను సాధించి, అభివృద్ధి పథంలో పరుగుపెట్టిస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్ల పూర్తి చేస్తామంటే ఎవరూ నమ్మలేదని, కానీ చేసి చూపించారని చెప్పుకొచ్చారు. మన దేశంలో ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే ఐదారుగురు ముఖ్యమంత్రులు మారతారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక్క కేసీఆరే పట్టుబట్టి పూర్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రం, ఆ కార్యక్రమాన్ని చేసి చూపిన నాయకుడు ఒక్క కేసీఆరే అని అన్నారు. 


ఆగస్టు 15 నుంచి లక్ష ఇళ్ల పంపిణీ


హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి అయ్యాయని.. వాటిని ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణఈ చేయబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. వాటిని నియోజకవర్గానికి 4 వేల చొప్పున పంపిణీ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి 3 వేల కుటుంబాలకు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 4 వేలు, గృహలక్షమీ పథకం కింద 3 వేల వస్తాయన్నారు.