జాతీయ భాష అంశంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పలు కామెంట్స్ చేశారు. "ఇండియాకి ఎలాంటి జాతీయ భాష లేదు, ఇక్కడ ఉన్న అన్ని అధికారిక భాషల్లో హిందీ ఒకటి మాత్రమే" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపై తీవ్రస్థాయిలో బీజేపీపై మండి పడ్డ మరుసటి రోజే కేటీఆర్ ఇలా స్పందించారు. ట్విటర్ వేదికగా హిందీ అంశంపై తన అసహనం వ్యక్తం చేశారు. "IITల్లో హిందీని తప్పనిసరి చేయటం ఎన్‌డీఏ ప్రభుత్వ ఫెడరలిజానికి ఉదాహరణ. ఏ భాష ఎంచుకోవాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయులందరికీ ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడంపై మేము పూర్తిగా వ్యతిరేకం" అని స్ఫష్టం చేశారు.






కేరళ సీఎం లేఖ
బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దవద్దని గట్టిగానే చెబుతున్నాయి. కేంద్రం అందరి మీదా "హిందీ" భాషను బలవంతంగా రుద్దాలని చూస్తోందని విమర్శిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా సార్లు చాలా మంది నేతలు గట్టిగానే స్పందించారు. హిందీ జాతీయ భాష అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దక్షిణాది రాష్ట్రాలు హిందీని వ్యతిరేకించడంలో ఎప్పుడూ ముందుంటాయి. అదే క్రమంలో తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు.


"కేవలం ఓ భాషను మాత్రమే ఎక్కువగా ప్రమోట్ చేసి, దాన్ని అందరిపైనా బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం మానుకోండి. ఇది సమైక్యతకు వ్యతిరేకం" అని ఆ లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. అంతే కాదు. భారత్‌లో "భిన్నత్వంలో ఏకత్వం" ఉందని, దానికి మచ్చ తెచ్చే పనులు మానుకోవాలని హితవు పలికారు. "భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత సంస్కృతి. ఎన్నో ఆచారాలు, భాషలు ఇక్కడ ఉన్నాయి. కేవలం ఓ భాషను వేరే వాళ్లపై రుద్దితే ఆ ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది" అని స్పష్టం చేశారు. 


గతంలో తమిళనాడు విద్యామంత్రి కే.పొన్‌ముది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. "హిందీ మాట్లాడే వాళ్లంతా ఎలాంటి నైపుణ్యాలతో పని లేని తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది" అని ఆయన గతంలో వ్యాఖ్య చేశారు. ఆ తరవాత అది సోషల్ మీడియాలోనూ యుద్ధానికి కారణమైంది. కొన్ని వర్గాలు హిందీ భాషకు మద్దతు ఇవ్వగా మరికొన్ని మాత్రం వ్యతిరేకించాయి.


అజయ్ దేవ్‌గణ్ - సుదీప్ మధ్య కొన్ని నెలల క్రితం ట్విటర్ వార్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, కన్నడ నటుడు సుదీప్ కిచ్చ మధ్య కూడా కొద్ది నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడిచింది. "హిందీ జాతీయ భాష కానే కాదు" అన్న సుదీప్ కిచ్చ కామెంట్స్‌ను ఖండిస్తూ అజయ్‌ దేవ్‌గణ్ ట్వీట్ చేశారు. "మై బ్రదర్ కిచ్చ సుదీప్. నీ దృష్టిలో హిందీ అనేది జాతీయ భాష కాకపోతే, మీ కన్నడ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారో చెప్పండి. హిందీ మా మాతృభాష. అది జాతీయ భాష కూడా" అంటూ అజయ్ దేవ్‌గణ్ అప్పట్లో ట్వీట్ చేశారు. అదే సమయంలో కిచ్చ సుదీప్‌కి కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై కూడా మద్దతుగా నిలిచారు.