హైదరాబాద్‌‌‌కు అన్ని వైపులా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరానికి తూర్పున ఉన్న ప్రాంతంలో లక్ష మంది ఐటీ ఉద్యోగులు పని చేసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. హైదరాబాద్‌‌లో ఐటీ రంగం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని ప్రభుత్వం భావించిందని అన్నారు. అందుకే ఐటీ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. వెస్ట్ హైదరాబాద్‌కి దీటుగా ఈస్ట్ హైదరాబాద్ కూడా ఐటీ రంగంలో ఎదుగుతుందని మంత్రి చెప్పారు. ఉప్పల్‌లో ఉప్పల్‌లో జెన్‌ ప్యాక్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.


జెన్‌ ప్యాక్ విస్తరణ పూర్తయితే లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తామని అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. జెన్‌ ప్యాక్‌ను వరంగల్‌లోనూ విస్తరిస్తున్నందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్‌ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగరం నలుమూలల విస్తరిస్తున్నాయని తెలిపారు కేటీఆర్. ముఖ్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు సేవలను విస్తరిస్తున్నాయని వివరించారు.


పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా తూర్పు హైదరాబాద్‌ ఎదుగుతున్నదని చెప్పారు. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోలులో శిల్పారామం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం కూడా ఈ ప్రాంతంలోనే ఉందని చెప్పారు. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు స్కైవే నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఉప్పల్‌ కూడలిలో స్కై వాక్‌ నిర్మాణం కూడా కొనసాగుతున్నదని చెప్పారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారని చెప్పారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని తెలిపారు.