రాష్ట్ర హక్కులు, డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ బడ్జెట్‌లో కనుక అన్యాయం జరిగితే కేంద్రంపై పోరాటం చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. గత ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు రాష్ట్రానికి అందలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఈసారి బడ్జెట్‌లో అయినా రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణతో పాటు ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం జరిగిన డ్రిల్‌మెక్ స్పా సంస్థ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో ప్రభుత్వం, ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు.


రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ సారి బడ్జెట్‌లోనైనా విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాయం ఇప్పటికి రాలేదని గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోదీ ఊరికే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటున్నారని.. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రం సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరం ఉందని అన్నారు. తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని కోరారు. 


మరోవైపు మేఘా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అయిన డ్రిల్‌మెక్‌ స్పా తెలంగాణలో రూ.1,500కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. చమురు రిగ్గర్స్, అనుబంధ పరికరాలు తయారీ పరిశ్రమ ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డ్రిల్‌మెక్‌ స్పా సంస్థ వెల్లడించింది.