Konda Surekha: తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేశాయి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. యావత్ తెలుగు ఇండస్ట్రీ ఆమె చేసిన కామెంట్స్‌పై ఫైర్ అవుతోంది. తెలంగాణలోని ప్రతిపక్షం కూడా మండిపడుతోంది. ఇంకా దీన్ని లాగితే మంచికాదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ... వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేసింది. మంత్రి కొండా సురేఖతో మాట్లాడిన తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్ గౌడ్‌ పరిస్థితి వివరించారు. 


కోపం , ద్వేషం లేదు: కొండా సురేఖ


టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో వెనక్కి తగ్గిన కొండా సురేఖ వ్యాఖ్యల వివాదంపై ఈ ఉదయం స్పందించారు. తాను కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌లో వేరే కుటుంబాన్ని లాగినందుకు చింతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అర్థరాత్రి తన అకౌంట్‌ నుంచి సమంత ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూతన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని కోరారు. "గాంధీ భవన్‌లో మాట్లాడేటప్పుడు, కేటీఆర్ క్యారెక్టర్ గురించి, వారు గతంలో చేసిన పనులు గురించి, మహిళల పట్ల వాళ్లకు ఉన్న చులకన భావం గురించి మాట్లాడాను. ఆయన నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడితే భావోద్వేగానికి లోనై కొన్ని విమర్శలు చేయాల్సి వచ్చింది. ఆ వ్యక్తులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. కోపం లేదు.


కేటీఆర్ క్యారెక్టర్‌ను ప్రజలకు చెప్పే క్రమంలో పొరపాటున ఆ ఫ్యామిలీ ప్రస్తావన వచ్చిందని సురేఖ అన్నారు. అందుకు తాను చాలా బాధపడ్డట్టు చెప్పుకొచ్చారు. "అనుకోని సందర్భంలో ఓ కుటుంబం ప్రస్తావన చేశాను. అది అనుకోకుండా నోటి నుంచి వచ్చింది. వాళ్ల ట్వీట్‌లు చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఏ విషయంలో నేను బాధపడుతున్నానో... ఆ విషయంలో ఇంకొకర్ని నేను నొప్పించానని తెలిసి వెంటనే నేను దాన్ని వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశాను. 


కేటీఆర్‌పై లీగల్‌ ఫైట్ చేస్తా: కొండా సురేఖ


తను ఏ విషయంలో బాధపడుతున్నానో వేరే వ్యక్తి కూడా అలాంటి విషయంలో బాధ పడకూడదన్నారు కొండ సురేఖ. అందుకే తాను చేసిన కామెంట్స్‌ను భేషరతుగా వెనక్కి తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే తనను ట్రోల్ చేసిన కేటీఆర్‌ మాత్రం క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. "నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ వేరొకరు పడకూడదని ఆలోచనతోటి భేషరుతుగా వెనక్కి తీసుకున్నాను. కేటీఆర్‌ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సి ఉంది. ఆయన చేసిందంతా చేసి నన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన దొంగై దొంగా దొంగా అని అరుస్తున్నట్టు ఉంది. ఆ విషయంలో  మాత్రం వెనక్కి తగ్గేది లేదు. "కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులకు న్యాయస్థానంలో పోరాడుతామన్నారు కొండా సురేఖ. 


బుధవారం మధ్యాహ్నం కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సాయంత్రానికి పెను దుమారాన్నే రేపాయి. ఇది కచ్చితంగా మరింత వివాదం అవుతుందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ముందే తేరుకుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌... పొద్దుపోయాక కొండ సురేఖతో మాట్లాడారు. ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వివరణ ఇవ్వాల్సిందిగా సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి వివాదానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 


లేట్ నైట్‌ ఎక్స్‌లో చేసిన పోస్టులో ఏమన్నారంటే... వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నా వ్యాఖ్యల ఉద్దేశ్యం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని సమంతను ట్యాగ్ చేస్తూ చెప్పారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడాఅన్నారు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురనట్లైతే భేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.


Also Read: ఆడపిల్లలంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?