వివాదం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే నాయకుడి పేరు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుందని అంటుంటారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ ఉంటూనే ఉంటుంది. ఈ బీజేపీ కీలక నేత రాజాసింగ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. 


ఆయన తాజాగా విడుదల చేసిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వీడియో చివర్లో.. తాను మాట్లాడింది అంతా కామెడీ అని... తాను చెప్పింది తనకే నచ్చలేదని చెప్పారు రాజాసింగ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో విడుదలైన ఈ వీడియాపై.. ఎంఐఎం, కాంగ్రెస్ భగ్గుమన్నాయి. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా అర్ధరాత్రి హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాల‌లో నిరసనలు చెలరేగాయి. స్టాండప్‌ కమెడియన్ మునావర్ ఫరూఖీ, అతని తల్లిని కూడా "కామెడీ" అని రాజాసింగ్ అన్నారు. రాజాసింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది ప్రజలు వీధుల్లో నిరసనలు చేశారు.


నుపూర్ శర్మ చెప్పిన విషయాలను పునరావృతం..


వీడియో చివర్లో, అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత.. తాను మాట్లాడినదంతా 'కామెడీ' అని, తాను చెప్పింది తనకే నచ్చలేదని చెప్పారు. సస్పెండైన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ ఇటీవల టీవీలో చెప్పిన కొన్ని విషయాలను సింగ్ పునరావృతం చేశారు. అప్పట్లో నుపుర్ శర్మ వ్యాఖ్యలను ముస్లిం దేశాలు అన్నీ తీవ్రంగా ఖండించాయి. భారత దేశం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో నుపుర్ శర్మను  బీజేపీ అధికార ప్రతినిధిగా అధిష్ఠానం సస్పెండ్ చేసింది. 


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ లో అర్ధరాత్రి బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు నిరసనలు చెలరేగాయి. సీపీ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని భవనీనగర్, డబీర్ పురా, రెయిన్ బజార్, మీర్‌చౌక్ సహా.. వివిధ ప్రాంతాల్లో కూడా ప్రజలు నిరసనలు తెలిపారు.


కాంగ్రెస్ నేత రషెద్ ఖాన్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తన మద్దతుదారులతో ఫిర్యాదు చేసేందుకు దబీర్‌పురా పోలీస్ స్టేషన్ ‌కు వచ్చారు. రాజాసింగ్ పై దబీర్ పురా పోలీసు స్టేషన్ లో Cr.no 133 /2022 under sec 153a, 295, 505 కింద కేసులు నమోదు చేశారు.