Manchu Manoj filed a complaint against Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు పోలీస్‌స్టేషన్ వరకు వచ్చాయి. మంచు విష్ణుపై మంచు మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన ఇంటికి విష్ణు వచ్చి వస్తువులు ఎత్తుకెళ్లాడని అందులో పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఈ కుటుంబ కలహాల ఎపిసోడ్‌లో మరో ట్విస్ట చోటుచేసుకుందని సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. 

ఆరు నెలల క్రితం మంచు ఫ్యామిలీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కేసులు, దాడులు ఓ సినిమాలో కనిపించిన సీన్‌లు అన్నీ ఈ వివాదంలో చోటు చేసుకున్నాయి. మధ్యలో మీడియాపై దాడి చేసిన కేసు కూడా మోహన్ బాబు మెడకు చుట్టుకుంది. అయితే కోర్టు, పోలీసుల వార్నింగ్‌తో ప్రత్యక్ష ఫైటింగ్‌కు దూరంగా ఉంటున్న మంచు బ్రదర్స్‌ న్యాయపోరాటాలు చేస్తున్నారు. 

వివాదం మొదలైన పదిహేను రోజులు కూడా ఏదో రకంగా వివాదం మీడియాలో ఉన్న టైంలో పెద్దల జోక్యంతో విష్ణు, మనోజ్ వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దీంతో వివాదం కూల్ అయిందని అంతా భావించారు. ఎవరి సినిమాల బిజీల్లో వారు పడిపోయారు. మంచు మనోజ్‌ అహం బ్రహాస్మి వాట్‌ ది ఫిష్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మంచు విష్ణు కన్నప్ప సినిమా షూటింగ్‌లో పడిపోయారు. 

కన్నప్ప, అహం బ్రహాస్మి సినిమాలపై చర్చించుకుంటున్న టైంలో మంచు మనోజ్‌ నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. జల్‌పల్లిలో ఉన్న తన ఇంట్లో తాను లేని టైంలో మంచు విష్ణు వచ్చి హంగామా చేసినట్టు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తన మనుషులతో వచ్చి కార్లు, వస్తువులు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నాడు. దాదాపు 150 మంది వరకు వచ్చి బీభత్సం సృష్టించారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. 

కుమార్తె బర్త్‌డే కోసం రాజస్థాన్‌ వెళ్లినప్పుడు విష్ణు తన మనుషులతో వచ్చి విధ్వంసం చేశాడని మనోజ్ ఆరోపిస్తున్నాడు. తన ఇంట్లో కనిపించకుండా పోయిన వస్తువులు విష్ణు ఆఫీస్‌లో లభ్యమైనట్టు తెలిపారుడ. కొన్ని ఎత్తుకెళ్లిన వారంతా మరికొన్నింటిని ధ్వంసం చేశారని వివరించాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు రిక్వస్ట్ చేశాడు. 

ఈ వివాదంపై ఇంట్లోనే పరిష్కరించుకునేందుకు యత్నించినట్టు మనోజ్ తెలిపాడు. తన తండ్రికి విషయం చెప్పేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదని వివరించాడు. తన తండ్రి మోహన్ బాబు అందుబాటులోకి రాలేదని అందుకే పోలీస్‌స్టేషన్‌కు రావాల్సి వచ్చిందని ఫిర్యాదులో వెల్లడించాడు.