Mahesh Kumar Goud: టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ స్వీకరణ కార్యక్రమానికి  కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు గాంధీ భవన్‎లో సీఎం రేవంత్ రెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. అనంతరం ఇందిరా భవన్‎లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహేష్ గౌడ్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.


తొలుత ఆయన నార్సింగిలోని తన నివాసం నుంచి పెద్దఎత్తున వాహనాలు, వేలాది మంది కార్యకర్తలతో మహేష్ కుమార్ గౌడ్ ర్యాలీ తరహాలో బయలు దేరి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అసెంబ్లీ వద్ద గన్ పార్క్ కు చేరుకున్నారు. అక్కడ అమర వీరుల స్తూపానికి నివాళి అర్పించారు. గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ కు మహా ర్యాలీగా మహేష్ కుమార్ గౌడ్ బయలు దేరారు.  


ఈ ర్యాలీలో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.. ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గన్ పార్క్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున వాహనాలు, గుర్రాలు, ఒంటెలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో అద్భుతమైన ప్రదర్శనలతో భారీ ర్యాలీ జరిగింది.