Munugode MLA: మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. శాసనసభ భవనంలోని సభాపతి గారి చాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్,  ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డ, రవాణా శాఖ మంత్రి   పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు మరియు లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును ఈ సందర్భంగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అందించారు.






మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో కేవలం మూడు రౌండ్లలోనే బీజేపీ ఆధిక్యం ప్రదర్శించగా, 12 రౌండ్లలో కారు జోరు సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లెప్ట్ పార్టీలతో పొత్తు టీఆర్ఎస్ కు కలిసొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్ విజయం సాధించడం ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ వద్ద టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. 


నల్గొండలో హ్యాట్రిక్ విజయం.. 


మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పై టీఆరెఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది.  హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ వరుసగా గెలుపొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది టీఆరెఎస్. తాజా గెలుపు తో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆరెఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.  


కాంగ్రెస్ ఫెయిల్..


మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ చతికిలపడింది. ఇటీవల ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావడం గగనం అయిపోతోంది. ఒక్క నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది. కానీ అక్కడా చతికిలపడిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా.. ఓడిపోయిన తర్వాత ఎన్ని రకాల కారణాలైనా చెప్పుకోవచ్చు.. కానీ వాట్ నెక్ట్స్ అనేది ముఖ్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా  కాంగ్రెస్‌కు ఓ పజిల్‌గా మారిపోనుంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.