HYDRA demolitions in Kukatpally | హైదరాబాద్: గత కొన్ని నెలలుగా హైడ్రా పేరు చెబితే నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. హైడ్రా ఎక్కడ తమ ఇంటిని కూల్చేస్తుందా అని కొత్త నిర్మాణం పూర్తయిన వారు, గతంలో గృహప్రవేశం చేసిన వారు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల భయంతో కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ భరోసా ఇచ్చారు.


కేటీఆర్ కామెంట్స్
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు, అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారు. హైడ్రా అనే బ్లాక్ మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పారు. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది. పిల్లలు పుస్తకాలను తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఎక్కడ తన ఇల్లు కూలగొడుతారమోనని 52 ఇళ్ల బుచ్చమ్మ అనే మహిళ భయాందోళనకు గురై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ల కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా ఉంది. ఎంతో కష్టపడి మా బిడ్డల కోసం ఇండ్లు కట్టామని బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 


ఆలోచన, ప్రణాళిక, పద్దతి లేకుండా చేశారు. వాళ్లే పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతారంట. హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య. మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూలగొట్టారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించాలా? ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు మాత్రమే చట్టాలున్నాయా? రేవంత్ రెడ్డి  నీ అన్నకు మాత్రం ఎఫ్టీఎల్ లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా?. పేదవాళ్లు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూల్చటమనేది ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన చర్య ఏదైనా ఉంటుందా ? . ఎన్నో హామీలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతాం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు. ఒక్క ఇళ్లు కట్టలేదు. కానీ ఎన్ని ఇళ్లు కూలగొట్టవో ప్రజలు గమనిస్తున్నారు.  


హైదరాబాద్ లో మాత్రమే కాదు ఊళ్లలో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు నీ కేబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. హైడ్రా తో ఆర్థిక మంత్రికి ఏంటీ సంబంధం. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన ఇస్తాడు. ఐదు మంది బిల్డర్ల పేరు చెబుతాడు. ఎందుకిదంతా బ్లాక్ మెయిల్ దందానా? నీ మంత్రులు, నీ తమ్ముళ్లకు ఇదే దందానా?. పెద్ద పెద్ద బిల్డర్లను బెదిరించి వాళ్ల దగ్గర దందా చేసి చందాలు తీసుకోవటానినా నీ ప్రభుత్వం ఉన్నది. గరీబోళ్ల ఇళ్లు కూలగొట్టి హైడ్రా పేరుతో దందా చేస్తున్నారు. బుచ్చమ్మ మరణం ఆత్మహత్య కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఈ హత్య కేసు రేవంత్ రెడ్డి పైన ఆయన హైడ్రా పైన పెట్టాలి. 


బుచ్చమ్మ కుటుంబానికి అండగా ఉంటాం. వారికి ఆర్థిక సాయం చేశాం. హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీకు న్యాయసాయం చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇవ్వాళ అరాచకం నడుస్తోంది. గరీబోళ్ల పొట్టకొట్టే ప్రభుత్వ చర్యలపై పోరాడుతాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం.  గరీబోళ్లకు మేము అండగా ఉంటాం. వారికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తోడుగా ఉంటారు. హైదరాబాద్ ప్రజలు మాకు ఓటు వేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగ, కసి పెంచుకుంది. కచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనందరం తిరగబడాల్సిందే’ అని కేటీఆర్ అన్నారు.