KTR Responds Rahul Gandhi Comments: తెలంగాణలో లబ్ధిదారులైన రైతులకు రైతు భరోసాను వేసినట్టుగా ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అబద్ధాలు ఎంతకాలం చెబుతారని నిలదీశారు. తెలంగాణలో ఎక్కడన్నా ఒక్క రైతుకైనా ఎకరానికి ₹7,500 వచ్చినదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో రాహుల్ గాంధీ రైతు భరోసా విషయంపై మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.


‘‘రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా...? తెలంగాణ ప్రజలతో.. డ్రామా ఆడుతున్నారా..? వేయని “రైతుభరోసా”ను వేసినట్టు ఎందుకీ అబద్ధాలు..? ఎంతకాలం ఈ అసత్యాలు..?? ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చినదా ఎకరానికి ₹7,500?


నాట్ల నాడు.. ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా.. డైలీ సీరియల్ లా సాగదీశారు. చివరికి పాత “రైతుబంధు” పూర్తిగా అందలేదు.“రైతు భరోసా” కైతే అసలు అడ్రస్సే లేదు. నాడు.. 15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదు. నేడు.. 15 వేలు ఇస్తానన్న ఛోటాబాయ్ ఇయ్యలేదు. మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు? అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ.. ఇంకెన్ని రోజులు?? డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది? కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది? ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన.. నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన.


ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన. 420 మోసపూరిత వాగ్దానాలతో.. నాలుగు కోట్ల ప్రజలను వంచించిన పాలన. ఒక్క మాట మాత్రం నిజం.. గాలిమాటల గ్యారెంటీలను నమ్మి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ.. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుంది. తెలంగాణకున్న ఏకైక గొంతుక BRS వైపే ప్రజా తీర్పు ప్రతిధ్వనిస్తుంది’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.