Kishan Reddy Arrives In Hyderabad: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాయంత్రం తాను, బండి సంజయ్ కలిసి హైదరాబాద్ వస్తామని చెప్పారు. కానీ సాయంత్రానికే పరిస్థితి మారిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, తెలంగాణ ఎన్నికల కమిటీ నిర్వాహక ఛైర్మన్ ఈటల రాజేందర్ సహా రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కానీ మొన్నటివరకూ బీజేపీ తెలంగాణ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు. అదేంటి.. రాష్ట్ర బీజేపీ కొత్త బాస్, తాజా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు కలిసి హైదరాబాద్ రాలేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.  


ఢిల్లీలోనే ఉండిపోయిన బండి సంజయ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమయ్యారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు వేదిరే శ్రీరామ్, సంగప్ప రైల్వే మంత్రిని కలిశారు. కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు సహా తన నియోజకవర్గం పరిధిలోని రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. కిషన్ రెడ్డి తో పాటు ఢిల్లీ విమానాశ్రయం వరకు వెళ్లిన బండి సంజయ్ చివరి నిమిషంలో తనకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నుంచి ఫోన్ రావడంతో వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ గురువారం హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. 






జులై 8న వరంగల్ లో ప్రధాని మోదీ పర్యటన..
జులై 8న ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్ లో రైల్ వ్యాగన్ తయారీ కేంద్రానికి ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారు. 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందని, రైల్వే ఓవర్ హాలింగ్ యూనిట్ అని తొలుత అనుకున్నాం. కానీ ప్రధాని వ్యాగన్ యూనిట్ పెట్టడానికి ఓకే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ ను రైల్వే తయారీ హబ్ గా తయారు చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్, తయారీ యూనిట్ రావడం ఇదే మొదటిసారి అన్నారు. నూతన జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారు
జూలై 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ ఎయిర్ స్ట్రిప్ ద్వారా నేరుగా హెలికాప్టర్ లో అక్కడికి వచ్చి, భద్రకాళి దర్శనం చేసుకోనున్నారు. రైల్వే యూనిట్ ను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారు. ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆ మరుసటి రోజు (జూలై 9న) దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్ లో జరుగుతుంది. దక్షిణ భారత దేశంలో పార్టీని పటిష్ఠం చేయడం గురించి చర్చిస్తారు. మార్పులు చేర్పులు అన్నీ పార్టీ నాయకత్వం ఆలోచించే చేస్తుందని, పార్టీ ఆదేశించే ఏ పనినైనా నిర్వర్తిస్తామన్నారు కిషన్ రెడ్డి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial