Section 163 Implemented In Hyderabad : ఏక్‌పోలీస్ విధానం కోసం పోరాడుతున్న బెటాలిన్ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో హైదరాబాద్‌లో ఎలాంటి ఆందోళనలకు, ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని కమిషనర్ సీవీ అనంద్ స్పష్టం చేశారు. భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్‌ 163 అమలు చేయనున్నట్టు ప్రకటించారు. రాజధాని హైదరాబాద్‌ నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుంచి నవంబర్‌ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై పూర్తిగా నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అశాంతి సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నాయని అందుకే ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 


పోలీసు శాఖలో అందరికీ ఒకే విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనబాటపట్టారు. నలుగురితో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. కుటుంబ సభ్యులతో కలిసి కానిస్టేబుళ్లు ధర్నాలు చేస్తున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఆందోళనలు చేయడం సరికాదని పలువురిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టికల్‌ 311 ప్రకారం 10 మంది కానిస్టేబుళ్లను విధుల నుంచి టెర్మినేట్ చేశారు. అంతే కాకుండా మరో 39 మందిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు వచ్చాయి. ఇది పోలీసు కుటుంబాల్లో మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. 


ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన తోటి ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధపడ్డారు. బెటాలియన్‌ ముఖద్వారం వద్ద ధర్నా చేశారు. ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు కూడా చేపట్టారు. దీన్ని మరింత ఉద్ధృతం చేయాలని సచివాలయ ముట్టడికి సిద్ధమయ్యారు. యూనిఫామ్‌తో వచ్చి సచివాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అందుకే ముందు జాగ్రత్తగా అధికారులు హైదరాబాద్‌లో ఆంక్షలు అమలు చేశారు. 


మరోవైపు రోడ్డు ఎక్కిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవడాన్ని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. "ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుం;f తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. "నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు" అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.? వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం." అని ఎక్స్‌లో పోస్టు చేశారు.