Pakistani: ప్రేమ ఖండాంతరాలు దాటుతోంది. కులం, మతం, ప్రాంతం ఆఖరికి దేశాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ప్రేమించిన వ్యక్తి కోసం సక్రమంగానో, అక్రమంగానో మరో దేశానికి చొరబడుతున్న కేసులు ఈ మధ్య కాలంలో కొన్ని వెలుగు చూశాయి. పెళ్లై 15, 20 ఏళ్లు గడిచి, ఇద్దరు పిల్లలు కూడా ఉండి పాకిస్థాన్ లో ఉండే ప్రియుడి కోసం దాయాది దేశానికి వెళ్లిన ఓ మహిళ గురించి కొన్ని రోజుల క్రితం వార్తాల్లో చూసే ఉంటారు, చదివే ఉంటారు చాలా మంది. పాక్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడ్డ ఓ వ్యక్తి తాజాగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి కూడా ప్రేమ వ్యవహారంలోనే దేశంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.


వీసా లేకుండా అక్రమంగా దాయాది పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి భారత దేశంలోకి వచ్చాడు. నేపాల్ మీదుగా ఆ వ్యక్తి భారత్ లోకి చొరబడినట్లు అధికారులు సమాచారం అందింది. ఆ వ్యక్తి నేపాల్ నుంచి దేశంలోకి చొరబడి హైదరాబాద్ కు చేరుకున్నట్లు నిఘా వర్గాలు టాస్క్ ఫోర్స్ పోలీసులకు కచ్చితమైన సమాచారాన్ని అందించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు పాకిస్థాన్ కు చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న మహమ్మద్ ఫయాజ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. 


హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కోసం మహమ్మద్ ఫయాద్ నగరానికి వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతికి ప్రెగ్నెన్సీ రావడంతో ఆమెను కలవడానికి నేపాల్ మీదుగా హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఫయాజ్ గురించి పోలీసులు పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుసుకున్న ఆ యువతి పోలీసు స్టేషన్ కు వచ్చినట్లు సమాచారం. పోలీసులు అరెస్టు చేసిన మహమ్మద్ ఫయాజ్ ను తనకు చూపించాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. అయితే.. ఫయాజ్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అతడి గురించి బయటకు చెప్పనున్నట్లు తెలుస్తోంది.


పబ్జీ కలిపిన ప్రేమ కథా


కరోనా సమయంలో పబ్ జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల భారతీయ వ్యక్తి సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ చెప్పారు. ఇప్పటికే గులాం హైదర్‌తో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను విడిచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఆమె మొదట మార్చిలో నేపాల్‌లో సచిన్‌ను కలుసుకుంది.


ఆ తర్వాత ఆమె హిందూ మతంలోకి మారిన తర్వాత హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మే 13న ఆమె పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. జులై 4వ తేదీన సీమా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమె అరెస్టు కూడా చేశారు. అలాగే ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్, అతని తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.