టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతూ ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడిగా ఆరోపణలు వినిపిస్తున్న అడ్వకేట్ శ్రీనివాస్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ జరుపుతున్నారు. సోమవారం (నవంబరు 21) శ్రీనివాస్ ను సిట్ అధికారులు ఐదు గంటలుగా విచారణ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్న సింహయాజి స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశారని శ్రీనివాస్ పై ఆరోపణలు వస్తున్నాయి. అక్టోబర్ 26 న తిరుపతి నుండి హైదరాబాద్ కు సింహయాజి స్వామికి శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సిట్ అధికారులు సేకరించారు.


ఈ ఆధారాల నేపథ్యంలో సింహయాజితో శ్రీనివాస్ కు ఉన్న పరిచయాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ తో సింహయాజికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించిన వ్యక్తులు ఎవరన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ లిస్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధారాలను ముందు ఉంచి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు బీఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్ హాజరు కాలేదు.


సుప్రీంకోర్టులో టీఆర్ఎస్‌కు ఊరట


మరోవైపు, ఇదే కేసులో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తి వేసింది. సింగిల్ జడ్ది పర్యవేక్షణ, సిట్ విచారణ నిలిపి వేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేసింది. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. సిట్ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్ పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తి వేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ లో ఉన్న పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని జస్టిస్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్నాసనం ఆదేశించింది.


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌ను మిగతా ముగ్గురు విచారణకు రాలేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ సహా నలుగురికి నోటీసులు ఇచ్చింది సిట్. 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ వైద్యుడు జగ్గుస్వామి, కేరళలోని భారత్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్‌, కరీంనగర్‌ న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ విచారణకు పిలిచింది. 41ఏ సీఆర్పీసీ నోటీసులు అందజేసింది. ఈ రూల్స్ ప్రకారం నోటీసులు అందుకుంటే కచ్చితంగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. 


అరెస్టులు వద్దన్న హైకోర్టు


సిట్ విచారణపై హైకోర్టుకు వెళ్లిన బీజేపీకి నిరాశే ఎదురైంది. జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించగా.. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను సైతం హైకోర్టు విచారించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని హైకోర్టుకు తెలపగా.. కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాలని సిట్ కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.