Hyderabad Accident: హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఆమె తల్లికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురువారం మన్సురాబాద్ నుండి ఎల్బీ నగర్ మార్గంలో.. కారు డ్రైవర్ రోడ్డుపై కారు ఆపాడు. ఓ వ్యక్తి కారు దిగి వెళ్లి పోగా.. ఆ వెంటనే కారు డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి వెనక వస్తున్న వాహనదారులను ఏమాత్రం గమనించకుండా హఠాత్తుగా కారు డోర్ తీశాడు. అదే సమయంలో కారుకు సమీపం నుండి వెళ్తున్న బైక్ కారు డోర్ కు ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ పై ఉన్న కుటుంబ సభ్యులు కింద పడిపోయారు. దంపతులతో పాటు వెంట ఉన్న రెండేళ్ల చిన్నారి ధనలక్ష్మి(2)కి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.


ఈ ప్రమాదంలో చిన్నారి తల్లి శశిరేఖకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న ఆ భర్త కూడా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శశిరేఖను దగ్గర్లోని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.


తిరుపతిలో తెలంగాణవాసుల మృతి..!


తిరుపతి జిల్లాలో కూడా నిన్న(గురువారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ఆర్టీసి బస్సును ఢీకొనగా.. ముగ్గురు మృతి చెందారు. మరో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి - శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఈ ప్రమాదం జరగ‌్గా.. మృతుల్లో భార్యాభర్తతో పాటు చిన్నారి పాప కూడా ఉంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సిబ్బందితో సహా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులతో పాటు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన కుటుంబంగా గుర్తించారు. 


ఇటీవలే మొదక్ లో రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం


మెదక్‌ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు ఆటోను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఆ సమయంలో ఆటోలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇంకో ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఆలూరుకు చెందిన శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మణెమ్మ (60), బాల నర్సయ్య (65) అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు చెప్పారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ అనే వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.