హైదరాబాద్ ముచ్చింతల్‌ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి రోజున జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొందించిన ఈ విగ్రహం కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎల్ఈడీ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన యాగంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యాగశాలలో ప్రధానికి చినజీయర్‌ స్వామి స్వర్ణకంకణం అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.  


130 కోట్ల ప్రజలకు యజ్ఞఫలం


ముచ్చింతల్ ఆశ్రమంలో 108 వైష్ణవ ఆలయాలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శిస్తున్నారు. అనంతరం సమతాస్ఫూర్తి కేంద్రం రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఎంపీ బండి సంజయ్, సుధాకర్ రెడ్డి సమతా స్ఫూర్తి కేంద్రంలో మోదీకి స్వాగతం పలికారు. ప్రధాని, గవర్నర్ విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్నారు. విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేశారు. ప్రధాని మోదీ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందన్నారు. గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారన్న ప్రధాని.. ఆ యజ్ఞఫలం130 కోట్ల ప్రజలకు అందాలన్నారు. 


ఆధునిక అంబేడ్కర్ 


రామానుజాచార్యులు అంధ విశ్వాసాలను పారదోలారని ప్రధాని మోదీ అన్నారు. రామానుజుడి విశిష్టాద్వైతం ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటి చెప్పారన్నారు. రామానుచార్యులు దళితులకు ఆలయ ప్రవేశం చేయించిన మహానుభావుడు అన్నారు. మనిషికి జాతి కాదు, గుణం ముఖ్యమని ఆయన లోకానికి చాటిచెప్పారని గుర్తుచేశారు. రామానుజాచార్యుల సమతా సూత్రం రాజ్యాంగానికి స్ఫూర్తి అని ప్రధాని తెలిపారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక అంబేడ్కర్ రామానుజాచార్యులు అన్నారు. హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్ పటేల్‌ కీలక పాత్ర పోషించారన్ ప్రధాని... సర్దార్‌ పటేల్‌ చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి కలిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 


అంతకు ముందు ఇక్రిశాట్ లో 


అంతకు ముందు ఇక్రిశాట్‌ 50వ వార్షికోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం స్మారక స్టాంపును కూడా విడుదల చేశారు. మొక్కల సంరక్షణపై వాతావరణ మార్పు పరిశోధన సౌకర్యం, రాపిడ్ జనరేషన్‌ అడ్వాన్స్‌ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఇక్రిసాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి... 2070 నాటికి నెట్‌జీరోను లక్ష్యంగా ఎంచుకున్నట్టు చెప్పారు.  పర్యావరణానికి అనుగుణంగా ప్రజల జీవితాలను జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యతకు గుర్తించామన్నారు మోదీ. ప్రోప్లానెట్‌ పీపుల్ ఉద్యానికి పిలుపునిచ్చామని.. వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి ఇవి తప్పనిసరి అన్నారాయన.  వ్యవసాయాన్ని సులభతరం చేయడం, నిలకడగా మంచి దిగుబడులు సాధించడంలో ఇక్రిసాట్‌కు ఐదు దశాబ్దాల చరిత్ర ఉందన్నారు ప్రధానమంత్రి మోదీ. ఈ విషయంలో చాలా దేశాలకు ఇక్రిసాట్‌ సహాయం చేసిందని గుర్తు చేశారు. భారత దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇక్రిసాట్‌ తన అనుభవాన్ని ఉపయోగిస్తుందని ఆశించారు మోదీ.