Hyderabad: భాగ్యనగరం హైదరాబాద్‌లో ఆదివారం ‘హైదరాబాద్‌ ఆఫ్‌ మారథాన్‌’ జరిగింది.ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, మాజీ బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్‌ హాజరయ్యారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్‌ నిర్వహించారు.ఈ మారథాన్‌లో మొత్తం 8 వేల మంది రన్నర్లు పాల్గొంటారు. మూడు విభాగాలుగా జరిగి ఈవెంట్‌లో ఉదయం 5.15 గంటలకు 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ ప్రారంభమైంది. ఆరున్నర గంటలకు 10కే, 7.45 గంటలకు 5కే రన్ ప్రారంభమయ్యాయి. ‘రన్ ఏజ్‌లెస్.. రన్ ఫియర్‌లెస్’ థీమ్‌తో ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నారు.


ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారథాన్‌లో పాల్గొనేవారు వయసు గురించిన ఆలోచనలకు అతీతంగా ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వయసును సంఖ్యకు పరిమితం చేయొద్దని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉన్నప్పుడే కాదని, ఏ వయసులో అయినా ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించవచ్చని అన్నారు. భారత్‌ను క్రీడలు ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా మార్చేందుకు అన్ని వయసుల వారి భాగస్వామ్యం అవసరమని సచిన్ పేర్కొన్నారు. 


కార్యక్రమం గురించి సచిన్ మాట్లాడుతూ.. ‘ఏజెస్ ఫెడరల్ దేశవ్యాప్తంగా తన మారథాన్‌ల ద్వారా అందరికీ నిర్భయ భవిష్యత్తుకు బాట వేస్తోంది. ఈ సంవత్సరం రేస్ థీమ్ 'రన్ ఏజ్‌లెస్, రన్ ఫియర్‌లెస్' ఇది  నిర్భయంగా కోర్సును పరిష్కరించడానికి, వారి ఉత్తమ ప్రయత్నాలను రూపొందించడానికి రన్నర్స్‌ను ప్రేరేపిస్తుందనే నమ్మకం నాకు ఉంది. రన్నింగ్ విషయానికి వస్తే.. చాలా మంది వ్యక్తులు తమను తాము వివిధ సవాళ్లలో పెట్టుకుంటారు. కొందరు ప్రాక్టీస్ షెడ్యూల్‌ను నిర్వహించడం గురించి, కొందరు వారి ఆహారం గురించి, కొందరు వారి ఫిట్‌నెస్ గురించి ఆందోళన చెందుతున్నారు. 


అయితే ప్రారంభించడానికి చాలా ఆలస్యమైందని ఎప్పుడూ భావించకూడదు.ఈ సంవత్సరం పాల్గొనేవారు వయస్సు గురించిన ఆలోచనలకు మించి ముందుకు వెళతారని, నెంబర్ ద్వారా పరిమితం చేయబడరని నేను ఆశిస్తున్నాను. మీరు యవ్వనంలో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడైనా మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. భారతదేశం క్రీడా-ప్రేమగల దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా మార్చడానికి, మనకు అన్ని వయసుల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అని పేర్కొన్నారు.


వైజాగ్‌లోనూ మారథాన్
వైజాగ్‌‌లో ఆదివారం 8వ ఎడిషన్ నేవి మారథాన్ ఘనంగా ప్రారంభమైంది. ఆర్కే బీచ్‌లో ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీలలో మారథాన్‌ను నిర్వహించారు. ఫుల్ మారథాన్‌ను చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కార్ జెండా ఊపి ప్రారంభించగా, హాఫ్ మారథాన్‌ను వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్ జెండా ఊపి ప్రారంభించారు. 10కే రన్‌ను విశాఖపట్నం సీపీ రవిశంకర్ ప్రారంభించారు. 


మారథాన్‌ పోటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. వైజాగ్​ మారథాన్​ 2023 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది. విశాఖ నగర ప్రాముఖ్యతను తెలపడానికి ఈ మారథాన్ ఎంతగానో ఉపయోగపడతుందని నేవీ అధికారులు తెలిపారు.