Hyderabad News: దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేని విధంగా.. బీఆర్ఎస్ పార్టీకి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మించనున్న భారీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. చండీహోమం, పుర్ణాహుతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మరే ఇతర రాజకీయ పార్టీలకు లేని విధంగా శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనుంది.


అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు


రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణఆ తరగతులు, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించేలా భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా ఈ కేంద్రంలో ఏర్పాట్లు చేయనున్నారు. 


అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ


పెద్ద పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ట్రాల వారీగా, రంగాల వారీగా వివరాలను సమీకరించడం, వాటిని క్రోడీకరించడం వంటివి చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేయనున్నారు. 


సీనియర్లు, నిపుణులతో శిక్షణా కార్యక్రమాలు


భారత్ భవన్ కు శిక్షణకు వచ్చే వారు బస చేసేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా ఈ భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ లో ఉంటాయి. దేశంలోనే అత్యంత పేరున్న సంస్థల్లో పని చేసిన కొందరు సీనియర్లను ఇందులో శిక్షణ ఇచ్చేందుకు, పరిశోధన కార్యక్రమాల కోసం నియమించనున్నారు. విశ్రాంత అధికారులు, న్యాయ నిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్న వారిని నియమించి వారి సేవలను వాడుకోనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీలు కె.కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, పసునూరి దయాకర్, మంత్రులు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలె యాదయ్య సహా ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.