Hyderabad News: హైదరాబాద్‌(Hyderabad) ఫైర్‌ జోన్‌లో మారిపోతోంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు(Fire Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. చలికాలంలోనే ఈ స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 

పంజాగుట్టలో ప్రమాదం

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఈసారి పంజాగుట్ట(Punjagutta)లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ఆరో అంతస్తులో మంటలు రావడంతో ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఉదయం నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది కాపాడారు. ఈ భవనంలో ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో చాలా ప్రమాదాలు జరిగాయి. 

స్వప్నలోక్‌ ప్రమాదం మర్చిపోలేం

అగ్ని ప్రమాదాలు అంటే భయకంపితులను చేసే ప్రమాదం స్వప్నలోక్‌ కాంప్లెక్స్(Swapna Lok Complex) ప్రమాదం. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. సికింద్రాబాద్‌(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్థులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. వారిలో ఆరుగురు ఊపిరి ఆడక మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కొందర్ని రక్షించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. 

ప్రభుత్వంపై విమర్శలు

స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో బట్టల షాపులు, గోడౌన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ టార్చ్‌లు చూపిస్తూ రక్షించాలని పలువురు వేడుకున్నారు. ఇది అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ సంస్థ ఉద్యోగాల పేరుతో కొందర్ని అక్కడే ఉంచి ట్రైనింగ్ ఇచ్చింది. వారికి తక్కువ జీతాలు ఇస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుకుంది. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.  తర్వాత ఆ భవనాన్ని కూల్చేశారు.

36 గంటల్లోనే ప్రమాదం

స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో దుర్ఘటన జరిగిన 36 గంటల్లోనే రాజేంద్రనగర్(Rajendranagar)శాస్త్రీపురం(Sastripuram)లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న తుక్కు గోదాంలో జరిగిన ప్రమాదంతో మంటలు చెలరేగాయి. గోదాంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయి. దట్టమైన పొగ వస్తుండడంతో స్థానకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

నాంపల్లిలో అగ్ని ప్రమాదం- పది మంది మృతి

ఎన్నికల టైంలో నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నవంబర్‌ 13న హైదరాబాద్ నాంపల్లి (Nampally) బజార్‌ఘాట్‌ (Bazarghat)లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు రిపేర్ చేస్తుండగా వచ్చిన నిప్పు రవ్వల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, దట్టమైన పొగ అలుముకుని దాదాపు 20 మందికిపైగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.  కెమికల్ నిల్వలు వల్లే ప్రమాదం జరిగిందని తేల్చిన పోలీసులు భవన యజమాని రమేశ్ జైశ్వాల్ ను అరెస్టు చేశారు. ప్రమాదం సమయంలో 30 డ్రమ్ములు పూర్తిగా కాలిపోగా, మరో 100 డ్రమ్ములను అగ్ని మాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు నిల్వ ఉంచడం వల్లే మంటలు ఒక్కసారిగా అంటుకుని వేగంగా వ్యాపించినట్లు చెప్పారు. 

సికింద్రాబాద్‌లో మరో ప్రమాదం

జులై 9న సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బట్టల దుకాణంలో మంటలు రాజుకున్నాయి. అవి షాప్‌ మొత్తానికి పాకిపోవడంతో మంటలు పెద్దగా మారాయి. వెంటనే ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఓ ఆయుర్వేదిక్‌ దుకాణం నుంచి మంటలు రేగాయి. 

అగ్ని ప్రమాదాలకు అడ్డాగా సికింద్రాబాద్

సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. మే 14 రాత్రి ఈ ఘటన జరగ్గా, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో చెక్క సామగ్రి కాలి బూడిద కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంటి యజమానిని శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్నారు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఆయన ఊళ్లో లేరు.

ఎల్బీనగర్‌లో కారులు దగ్ధం

మే 30న హైదరాబాద్ ఎల్బీ నగర్‌(LB Nagar)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ టింబర్‌ డిపోలో మంటలు తీవ్రంగా చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న ఓ సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంకు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. టింబర్‌ డిపో, కార్ల గ్యారేజీ పక్కన ఉన్న మల్టీప్లెక్స్‌, అపార్ట్‌మెంట్‌లకు మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రదేశంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీని వల్ల కోట్లలో ఆస్తినష్టం జరిగింది. 

అబిడ్స్‌లో సెక్యూరిటీ గార్డు మృతి

25 మార్చిలో హైదరాబాద్ అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబిడ్స్‌లోని బొగ్గుల కుంట కామినేని ఆస్పత్రి పక్కనే ఉన్న ఓ కారు మెకానిక్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెరేగాయి. పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడు కార్లు పూర్తిగా కాలిపోయాయని.. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు సంతోష్ సజీవ దహనం అయ్యాడు. ఇలా హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇవి కాకుండా చిన్న చిన్న ప్రమాదాలు చాలానే ఉన్నాయి.