Minister  Srinivas Goud : గాల్లోకి తుపాకీ కాల్పులు చేసినందుకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం విడ్డురంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సాధారణంగా కాల్పుల ఘటన విచారణలో ఉందన్నారు. తాను పేల్చింది రబ్బర్‌ బుల్లెట్‌ అని మరోసారి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. విపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.


బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి 


సర్దార్‌ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కుమురం భీం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి మహనీయుల జయంతి వేడుకలను అన్ని వర్గాలు కలిసి చేసుకోని చక్కటి స్ఫూర్తిని చాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. అప్పుడే ఆ మహనీయుల ఆత్మ శాంతిస్తుందని అన్నారు. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నా మోదీ ఆయా వర్గాలకు మేలు చేయాలని కోరారు.  దేశ వ్యాప్తంగా 52 శాతం ఉన్న బీసీ జనాభా ఉన్న దృష్ట్యా  కేంద్రం బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. అనేక అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉండడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కూల్చాలన్న ఆలోచన తప్ప కేంద్రానికి మరో ఆలోచన లేదని ఆక్షేపించారు. 






మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్


తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పుచ్చుకొని గాలిలోకి కాల్పులు చేసిన వ్యవహారం, విపక్షాలు మరిన్ని విమర్శలు చేసేందుకు తావిస్తోంది. తాజాగా ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరిపేందుకు ఏ చట్టం అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ఒక ప్రైవేటు వ్యక్తికి తుపాకీ ఇవ్వవచ్చని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు దీనికి సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రఘునందన్ రావు డీజీపీని కూడా విమర్శించారు.


డీజీపీ మహేందర్‌ రెడ్డి కూడా ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి గన్‌ లైసెన్స్‌ ఉందా? అని ప్రశ్నించారు. ఆ తుపాకీ పేల్చే సమయంలో పొరపాటున గురితప్పి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు. మంత్రి ఫైర్‌ చేసిన గన్‌ను ఇంతవరకూ ఎందుకు సీజ్‌ చేయలేదని, మంత్రి సహా ప్రైవేటు వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమనే అధికారం ఎస్పీ సహా ఎవరికీ లేదని అన్నారు. ఒకవేళ ఎస్పీ గన్ ఇచ్చి ఉంటే ఆయనను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ గన్ లో రబ్బరు బుల్లెట్లు ఉన్నాయన్న మంత్రి స్పందనను రఘునందన్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. గన్ మెన్ల దగ్గర ఉండే తుపాకుల్లో రబ్బరు బుల్లెట్లు ఉంటాయా అని ప్రశ్నించారు.


Also Read : Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్