Hyderabad Drugs Case: న్యూ ఇయర్ తరవాత వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఎడ్విన్ అనుచరులు కృష్ణ కిషోర్ రెడ్డి, డీజే మైరాన్ విచారణలో ఆసక్తికర విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పుడు అధికారులు సూపర్ లగ్జరీ ట్రాన్స్ పోర్టులపై దృష్టి పెట్టక తప్పడం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ కృష్ణకిషోర్ రెడ్డి అందమైన అమ్మాయిలు, డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. అదే కాకుండా తన సంవితులకు కూడా డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈ క్రమంలో పబ్లకు, పెద్దపెద్ద పార్టీలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు స్నేహితులను తీసుకొని వెళ్లేవాడు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేవాడు. తరచూ గోవాకు వెళ్లి పెద్దపెద్ద పార్టీల్లో తనతో పాటు స్నేహితులకు సైతం డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. జల్సాలు చేస్తూ స్నేహితులకు డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు ఇచ్చేవాడు. గోవాలోనే అంతర్జాతీయ స్మగ్లర్ ఎడ్విన్ తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు.


సూపర్ లగ్జరీ ట్రాన్స్ పోర్ట్, పచ్చళ్ల మాటున డ్రగ్స్ సప్లై..


తన స్నేహితుల కోసం డ్రగ్స్ నగరానికి తేవడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకునేవాడు. అందులో భాగంగానే సూపర్ లగ్జరీ ట్రాన్స్ పోర్టు వెహికిల్స్, పచ్చళ్లు, మాటున డ్రగ్స్ ని హైదరాబాద్ సప్లై చేసేవాడు. ఎక్కడా అనుమానం రాకుండా తన వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ఎడ్విన్ చెప్పిన ప్రాంతానికి పంపేవాడు. ఈ క్రమంలోనే డీజే మైరాన్ మోహితో కృష్ణ కిషోర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ హైదరాబాదీలు కావడంతో ఇద్దరూ కలిసి పెద్ద తరహాలో కార్యక్రమాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లని విచారణలో తెలిపారు. మైరాన్ గతంలో తక్కువ జీతానికే పబ్ లో వెయిటర్ గా పని చేసేవాడు. ఆ తర్వాత డీజే ప్లేయర్ గా శిక్షణ తీసుకున్నాడు. అనంతరం తానే డీజే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొండాపూర్ కు మకాం మార్చి 'ది అస్క్రిప్ట్ డీజే కంపెనీ' అనే సంస్థను ప్రారంభించాడు. డీజే టీమ్ తో గోవా, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో జరిగే కార్య క్రమాలకు వెళ్లేవాడు. 


ఈ క్రమంలో గోవాలో అంతర్జాతీయ స్మగ్లర్ ఎడ్విన్ తో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో డీజేల మాటున కార్యక్రమంలో డ్రగ్స్ సరఫరా చేసేవాడు. స్మగ్లింగ్ లో రూ.కోట్లు సంపాదించిన  మైరాన్.. ఇంకా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అంతర్జాతీయ కొకైన్ స్మగ్లింగ్ లో కింగ్ పిన్ గా పేరుగాంచిన ఎస్కో బార్ ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. సినీ తరహాలో తలపించే విదంగా గల్లీ నుండి ఢిల్లీ స్థాయిలో తమకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న వీళ్లు.. చీకటి మాటున రాజ్యాని ఏలుతున్నారు. అయితే ఇప్పుడు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు అధికారులు వివిధ రకాలుగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడ అనుమానం కలిగినా, తక్షణమే వారిపై చర్యలు తీసుకునే విదంగా హెచ్ న్యూ బృందం సిద్ధమవుతోంది.