హైదరాబాద్‌లో ఆర్చ్ బిషప్ గా ఉన్న డాక్టర్ పూల ఆంటోనీ కార్డినల్ గా నియమితులు అయ్యారు. దళితుడైన ఈయన కార్డినల్ స్థాయిలో నియమితులు కావడం చరిత్రలో ఇదే తొలిసారి. క్రైస్తవ మత గురువు అయిన పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో పూల ఆంటోనీపై ఎరుపు టోపీ (Red Biretta) ఉంచి, ఆయన వేలికి ఉంగరం తొడిగి బాధ్యతలు అప్పగించారు. అనంతరం పోప్ పూల ఆంటోనీని ఆలింగనం చేసుకొని, ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు.


వాటికన్‌లో ఇప్పటి వరకు భారతీయ సంతతికి చెందిన నలుగురు కార్డినల్స్ ఉన్నారు. గోవా నుండి ఆంథోనీ, ఫిలిప్ నెరి ఫెర్రావ్‌లతో మొత్తం వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. అరవై ఏళ్ల ఆంథోనీ 1992లో ప్రీస్ట్ గా ఉండేవారు. 2008లో కర్నూలు బిషప్‌గా నియమితులయ్యారు. 2020 ఏడాదిలో హైదరాబాద్ ఆర్చ్‌బిషప్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత మే 2022లో పోప్ ఫ్రాన్సిస్ ఆయన్ను కార్డినల్‌గా ఎంపిక చేశారు. అలా ఒక దళిత వ్యక్తి ఈ స్థాయిని చేరుకున్న తొలి వ్యక్తిగా హైదరాబాద్ డియోసెస్ ఆర్చ్ బిషప్ డాక్టర్ పూలా ఆంథోనీ సాధించారు. మొదటి దళిత కార్డినల్‌గా మాత్రమే కాకుండా, హైదరాబాద్ డియోసెస్ ఆర్చ్ బిషప్‌గా తెలుగు రాష్ట్రాల నుండి మొదటి వ్యక్తిగా ఈ కీలక పదవి పొందిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. చదగిన గుర్తింపు, డాక్టర్ పూల ఆంథోనీ మొదటి దళిత కార్డినల్‌గా మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి మొదటి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.


కార్డినల్ అంటే ఎవరు?
ప్రపంచంలోనే నంబర్ వన్ అయిన పోప్ కి తర్వాత పదవి కార్డినల్. వీరు పోప్ తర్వాత అంత గౌరవం పొందుతారు. ఈ కార్డినల్స్ చాలా మంది ఉంటారు. వీరే పోప్‌ను కూడా ఎన్నుకుంటారు. క్యాథలిక్స్‌లో వీరు నెంబరు 2 కాబట్టి, వీళ్లని ప్రిన్స్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 229 మంది కార్డినల్స్ ఉంటారు. దాంట్లో ఇండియా నుంచి తాజా నియామకాలతో ఆరుగురికి చేరింది.


కార్డినల్స్ కి కింది స్థాయిలో ఆర్చి బిషప్ ఉంటారు. వీరు ఒక రాష్ట్రానికి ఉండొచ్చు లేదా కొన్ని చర్చిలకు కలిపి లేదా రెండు మూడు జిల్లాలకు కలిపి బిషప్ ఉండొచ్చు. 


క్యాథలిక్ చర్చిల్లో ఒక ప్రీస్ట్ ఉంటారు. ఈ ప్రీస్ట్ కింద చర్చి విధుల్లో ఉండే వాళ్లను డీకాన్స్ అంటారు. ఒక చర్చిలో చాలా మంది డీకాన్స్ ఉండొచ్చు.


క్యాథలిక్‌లు, ప్రొటెస్టెంట్‌ల మధ్య తేడా ఏంటి?
ఇస్లాం మతంలో షియాలు, సున్నీలు అని వివిధ వర్గాలు ఉన్నట్లుగానే క్రిస్టియన్స్ లో కూడా ప్రధానంగా క్యాథలిక్‌లు, ప్రొటెస్టెంట్‌లు ఉంటారు. ఈ క్యాథలిక్ క్రిస్టియన్లలో దళితులు చాలా మంది ఉన్నారు. వీరి పూర్వీకులు వందల ఏళ్ల క్రితమే ఆ మతం పుచ్చుకున్నారు. కానీ, దళితులు కార్డినల్ పదవి స్థాయికి చేరుకోలేకపోయారు. ఇన్నాళ్లకు ఒక దళిత వ్యక్తికి కార్డినల్ పదవిని ఇచ్చారు.


వాటికన్ సిటీలో ఉండే పోప్ ఫ్రాన్సిస్ ను ప్రపంచంలోని క్రిస్టియన్లు తమ మత పెద్దగా గుర్తించి ఆయన అడుగు జాడల్లో నడిచేవారిని క్యాథలిక్స్ అంటారు. ఈ క్యాథలిక్ చర్చిలో ప్రీస్ట్ నుంచి పోప్ వరకూ దశల వారీగా వారికి ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థను వందల ఏళ్లుగా పాటిస్తూ వస్తున్నారు.


ప్రొటెస్టెంట్లు అంటే..
పోప్ ఫ్రాన్సిస్ తో సంబంధం లేకుండా సొంత విధానాల్లో చర్చిలు నడిపే వారిని ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈ చర్చిల్లో పాస్టర్ల నియామకాలు, కొత్త చర్చిలు ఏర్పాటు లాంటివన్నీ ఎవరికి వారు సొంతంగా చేసుకుంటారు. క్యాథలిక్‌లకు, ప్రొటెస్టెంట్‌లకు ప్రధాన తేడా ఏంటంటే.. ఒక ప్రొటెస్టెంట్ సొంతంగా చర్చి పెట్టుకోవచ్చు, ఎవరైనా పాస్టర్ కావచ్చు. కానీ, క్యాథలిక్ మాత్రం ఒక చర్చి కట్టడం నుంచి, ఫాదర్ నియామకం వరకూ అన్నీ వారి వ్యవస్థలోని పై అధికారులు నిర్ణయం తీసుకొని చేస్తారు. 


కాథలిక్ చర్చిల్లో మనకు కనిపించే బ్రదర్స్, ఫాదర్స్, నన్స్ అందరూ కచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. వీరి ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. వారు స్కూలులో ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టి 12 ఏళ్ల ట్రైనింగ్ తరువాతే ఎవరైనా క్యాథలిక్ చర్చిలో ఫాదర్ లేదా ప్రీస్ట్ అవుతారు.


ప్రొటెస్టెంట్ చర్చిలో ఏ ట్రైనింగ్ లేకుండా కూడా పాస్టర్ అవ్వచ్చు. వీరికి బ్రహ్మచర్చం పాటించాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయలు కొట్టడం, గుండు చేయించుకోవడం, కొవ్వొత్తులు వెలిగించడం, బొట్టు పెట్టుకోవడాన్ని కాథలిక్కులు అంగీకరిస్తారు. ప్రొటెస్టెంట్లు ఇందుకు భిన్నంగా ఉంటారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మన దేశ క్రిస్టియన్స్‌లో 60 శాతం ప్రొటెస్టెంట్లు, 33 శాతం కాథలిక్స్, మిగతా ఇతర క్రైస్తవ వర్గాలు ఉన్నాయి.