Ola Cabs To Pay Rs 95,000 To Passenger For Overcharging: హైదరాబాద్‌: కస్టమర్లకు మెరుగైన సేవలే మాకు ముఖ్యం. వారికి కావాల్సిన సేవలు అందిస్తూ ఏ రంగంలోనైనా రాణించాలనుకుంటాయి సంస్థలు. అయితే కస్టమర్‌కు కోసం తెప్పిస్తే, ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వివరాలపై ఓ లుక్కేయండి. ఓ కస్టమర్ నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం, నాసి రకం సేలు అందించిన కేసులో క్యాబ్‌ సేవల సంస్థ ఓలాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బాధిత కస్టమర్‌కు ఏకంగా రూ. 95,000 పరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఓలా సంస్థను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌కు చెందిన జబేజ్ శామ్యూల్ అనే వ్యక్తి 2021, అక్టోబర్ 19న ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన భార్య, మరో వ్యక్తితో కలిసి ఓలా క్యాబ్‌‌లో ప్రయాణించారు. కానీ ఆ క్యాబ్ అంత శుభ్రంగా లేదు. వాసన కూడా రావడంతో ఓలా డ్రైవర్‌ను ఏసీ ఆన్ చేయమని కోరితే.. అతడు నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఓలా డ్రైవర్ తనకు సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే ఓకే అని లైట్ తీసుకున్నాడు. కానీ డ్రైవర్ మాటతీరు చాలా దురుసుగా ఉంది. దాంతో పాటు కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.200 మేర వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ కస్టమర్ వద్ద ఓలా డ్రైవర్ బలవంతంగా రూ.861 వరకు తీసుకున్నాడు. 
డెస్టినేషన్ రాకున్నా దించేశాడు..
తాము వెళ్లాల్సిన డెస్టినేషన్ కు మార్గం మధ్యలోనే తనను, తన వారిని డ్రైవర్ ఓలా క్యాబ్ నుంచి దించివేసి అధిక డబ్బులు వసూలు చేశాడని కస్టమర్ జబేబ్ శామ్యూల్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఓలా సంస్థను దీనిపై ప్రశ్నించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శామ్యూల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. డ్రైవర్ పదేపదే డబ్బు ఇవ్వాలని వేధించడంతో తప్పని పరిస్థితుల్లో తన గమ్యం చేరుకోకున్నా అధికంగా డబ్బులు వసూలు చేశాడని కస్టమర్ జబేజ్ శామ్యూల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.. 
రూ.95 వేలు కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశాలు
కస్టమర్ శామ్యూల్‌ వినియోగదారుల చట్టం సెక్షన్ 35 కింద హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. తన వద్ద ఓలా క్యాబ్ డ్రైవర్ ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేశాడని, పైగా ఓలా ప్రతినిధులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. నాసిరకం సర్వీసు అందించడంతో పాటు డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించాడని కస్టమర్ ఆరోపించారు. ఓలా ప్రతినిధులు సైతం తమకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ దాదాపు రూ.4 నుంచి 5 లక్షలు ఇప్పించాలని పిటిషనర్ కోరాడు. ఈ కేసు విచారించిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. పిటిషనర్ కోరింది పెద్ద మొత్తం నగదు అని, రూ.95,000 కస్టమర్‌కు చెల్లించాలని కమిషన్ ఓలా సంస్థను ఆదేశించింది.


ట్రిప్ ఛార్జీలు రూ.861కి వడ్డీతో పాటు మానసిక వేదనకు రూ.88 వేలు, ప్రొసీడింగ్స్ రూ.7 వేలు కలిపి మొత్తం రూ.95 వేలు కస్టమర్ కు ఓలా సంస్థ చెల్లించాలని తన ఆదేశాలలో పేర్కొంది. 45 రోజుల్లో ఈ పరిహారం కస్టమర్ కు అందించాలని ఆదేశించింది వినియోగదారుల కమిషన్.