Chain Snatching: భాగ్యనగరంలో నిత్యం చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం (అక్టోబరు 10) సిటీలో ఓ చైన్ స్నాచింగ్ యత్నం జరిగింది. ఓ తల్లి తన కూతురుని బడి నుంచి ఇంటికి తీసుకువెళ్తుండగా ఓ చైన్ స్నాచర్ ఆమెను ఫాలో అయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం, స్థలంలో చైన్ లాక్కుని పారిపోవడానికి యత్నించాడు. ప్రతిఘటించిన మహిళపై పిడిగుద్దులు కురిపించాడు. బ్యాగ్ తీసుకుని పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు చైన్ స్నాచర్‌ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. ఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.


నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుండి గొలుసు దొంగతానికి ప్రయత్నించిన ఓ దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాపునగర్ శివాలయం ఉంది. అక్కడ చదువుతున్న తన కూతురిని ఇంటికి తీసుకు వెళ్లడానికి వెళ్లింది. అక్కడి నుంచి బిడ్డతో ఇంటికి బయల్దేరింది. అయితే ఆమెను ఓ చైన్ స్నాచర్ ఫాలో అయ్యాడు. మెడలో బంగారం చూసి కాజేయాలని స్కెచ్ వేశాడు. ఆమెకు తెలికుండా ఆమె వెనుకే వెళ్లాడు. 


ఎవరు లేని చోట, మహిళ ఒంటరిగా వెళ్తుండగా మెడలో చైన్ తెంచేందుకు యత్నించాడు. మహిళ తీవ్రంగా ప్రతిఘటించి దొంగను తోసేసింది. దీంతో ఆగ్రహించిన చైన్ స్నాచర్ మహిళ పొత్తి కడుపులో పడి గుద్దులు కురిపించాడు. నొప్పి భరించలేని మహిళ చేతిలో బ్యాగ్, చైన్‌ను వదిలిపెట్టేసింది. అదే అదునుగా స్నాచర్ వాటితో పారిపోవడానికి యత్నించాడు. అయితే బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు దొంగను వెంబడించారు. పట్టుకుని దేహశుద్ధి చేశారు. లంగర్ హౌజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


చందానగర్‌లో మంగళసూత్రం దోపిడీ
గత ఏప్రిల్ నెలలో చందానగర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలోంచి 4 తులాల మంగళ సూత్రాన్ని అపహరించారు. చందానగర్ పీజేఆర్ స్టేడియం సమీపంలో ఉంటున్న శ్యామల (40) షాపింగ్‌కు వెళ్లారు. కేఎల్ఎం మాల్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో పీజేఆర్ స్టేడియం వద్ద గుర్తు తెలియని అగంతకులు వెనక నుంచి బైక్ మీద వచ్చి నాలుగు తులాల మంగళ సూత్రాన్ని అపహరించుకు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


కూకట్‌పల్లిలో ఇలాంటి ఘటనే
కూకట్ పల్లిలో ఫిబ్రవరి నెలలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ మహిళ బాలకృష్ణ నగర్ లో కూరగాయలు కొనుగోలు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి సైనిక్ పురికి ఎలా వెళ్లాలని అడ్రాస్ అడిగాడు. జేబు నుంచి కారం తీసి మహిళ కళ్లలో చల్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో బాధితురాలి భర్త టూవీలర్ పై వస్తూ ఈ సంఘటనను గమనించాడు. చోరీకి ప్రయత్నించిన దొంగను స్థానికుల సహాయంతో పట్టుకొని దేహశుద్ధి చేశాడు.