Hyderabad: హైదరాబాద్ అంటే ఛార్మినార్, గోల్కొండ, బిర్లా మందిర్, వైట్‌హౌజ్‌ను తలపించే సెక్రటేరియట్, ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం లాంటి ఎన్నో పర్యాటక అద్భుతాలు గుర్తుకు వస్తాయి. ఈ జాబితాలో మరో నిర్మాణం చేరనుంది. హుస్సేన్ సాగర్ కు సమీపంలో ఉన్న జలవిహార్ కు దగ్గర్లో లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండీఏ నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ లేక్ ఫ్రంట్ పార్క త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.


హుస్సేన్ సాగర్ కు సరికొత్త అందం చేరబోతోందని అన్నారు. నగర ప్రజలు అందమైన బోర్డ్ వాక్‌ని సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఓవైపు ట్రాఫిక్ జంఝాటాన్ని తగ్గించేందుకు ఫ్లైఓవర్లు, స్కై వేలు, అండర్‌పాస్‌ లు నిర్మిస్తూనే మరోవైపు నగర సుందరీకరణ పనులు, ఆహ్లాదాన్ని కలిగించే పార్కుల నిర్మాణం, పర్యాటక ప్రాంతాలను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది.


జలవిహార్ కు సమీపంలో 10 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేక్ ఫ్రంట్ పార్క్ ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఈ పార్క్ ను త్వరలోనే ప్రారంభిస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ పార్క్ నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రూ. 15 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో అండర్‌పాస్‌లు, స్కైవేలు, సీటింగ్ తో కూడిన వాటర్ ఛానల్స్, లేక్ వంటి అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలో చిన్నపిల్లలకు ఆటవిడుపు కోసం పార్క్ ను కూడా తీర్చిదిద్దారు. హుస్సేన్ సాగర్‌పై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్ ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్ లు ఏర్పాటు చేశారు. పార్కులో ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్ అదనపు ఆకర్షణ. పార్కులో పిల్లల కోసం ఆటస్థలాలతో పాటు పెర్గోలాస్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ డి ప్రదాన్ ఈ పార్కు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారు.


కాగా, ఈ లేక్‌ఫ్రంట్ పార్కు నిర్మాణం వల్ల 35 పక్షి జాతులకు భంగం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు పిటిషన్ వేయగా.. గతంలో సుప్రీం కోర్టు ఈ పార్కు నిర్మాణంపై ఆంక్షలు విధించింది. జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే విధంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదని సుప్రీం కోర్టు గతంలో హెచ్ఎండీఏను ఆదేశించింది. అయితే ఈ పార్కు నిర్మాణంతో జీవవైవిధ్యానికి ఎలాంటి నష్టం జరగబోదని, నష్టం జరగకుండా నిర్మాణం చేపడాతమని హెచ్ఎండీఏ కోర్టుకు తెలిపింది. ఇలా పలు మార్లు వాదనలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు లేక్‌ ఫ్రంట్ నిర్మాణం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ప్రజలను అందుబాటులోకి రానుంది.