హైదరాబాద్‌కు ముసురు పట్టింది. మూడు రోజుల నుంచి వాన పడుతున్నా కాస్త గ్యాప్ ఇచ్చేది. కానీ బుధవారం సాయంత్రం నుంచి మాత్రం గ్యాప్ ఇవ్వకుండ పడుతూనే ఉంది. దీంతో చాలా కాలనీలు నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని రోడ్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 


హైదరాబాద్‌లో ఒక్క ఏరియా అని కాదు దాదాపు అన్ని ఏరియాల్లో వర్షం దంచి కొడుతోంది. కనీస అవసరాలకు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే అధికార యంత్రాంగం కూడా హై అలర్ట్ ప్రకటించింది. స్కూల్స్‌కు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచినలు చేస్తోంది. 


ఎగువన కురుస్తున్న వర్షానికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ నదికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ క్షణమైనా శిబిరాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. 






భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అత్యవసరమైతే 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.