ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అరెస్టులు అప్రజాస్వామికం – హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సందర్భంగా విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికం, పిరికిపంద చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “ఒక్క విద్యార్థిపై లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇందుకేనా విద్యాశాఖ, హోంశాఖలను మీ వద్ద ఉంచుకున్నది?” అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. “ఓయూ విద్యార్థులు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ మీ మోసపూరిత హామీల గురించి నిలదీస్తోంది. మొత్తం సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? ఏడో గ్యారంటీ పేరుతో ప్రజాస్వామ్యం చెప్పి, ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చారు రేవంత్ రెడ్డి,” అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చారు..
తెలంగాణ సీఎంగా కేసీఆర్ సమయంలో ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు ఇవ్వడం, కేసీఆర్ హయాంలో ప్రారంభించిన నిర్మాణాలను పూర్తి చేయడం తప్ప 22 నెలల పాలనలో ముఖ్యమంత్రి ఏమి సాధించలేదని హరీశ్ రావు విమర్శించారు. “జాబ్ క్యాలెండర్ని జాబ్లెస్ క్యాలెండర్గా మార్చారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట వంచన చేశారు. 22 నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని ఆరోపించారు.
నోటిఫికేషన్లు అడిగితే నిరుద్యోగులపై అక్రమ కేసులు
“విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నోటిఫికేషన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న విద్యార్థులు ఉన్నా, సీఎం మాత్రం ఢిల్లీ చక్కర్లు కొడుతూ కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే లైబ్రరీల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించి, విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన చరిత్ర కలిగినదని హరీశ్ రావు పేర్కొన్నారు. “ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల నిరసన జ్వాలను ఆర్పలేరు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరు. పోలీసు బలంతో విద్యార్థుల గళాన్ని అణగదొక్కలేరు” అని హరీష్ రావు స్పష్టం చేశారు.
“ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు సింహాల్లా గర్జిస్తారు. ఉద్యోగాల పేరిట చేసిన మోసాన్ని ఎక్కడిక్కడ నిలదీస్తారు. విద్యార్థులకు క్షమాపణలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం,” అని హరీశ్ రావు హెచ్చరించారు.