బీజేపీ నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ప్రాణాపాయం తప్పింది. ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం‌ టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. అయితే వాహనం కండీషన్ సరిగ్గా లేదని, నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన జరిగింది. ఒకవేళ వాహనం రెగ్యూలర్ తరహాలో వేగంగా వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. 


బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి రాజా సింగ్ రిక్వెస్ట్ చేశారు. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వాహనాన్ని ఇకనైనా వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గులేదు!
తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండీషన్ సరిగా లేదని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రాజా సింగ్. తెలంగాణ హోం మంత్రికి, సీఎం కేసీఆర్ కు సిగ్గు శరం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తాను, సాయంత్రం తిరిగి వెళ్తుంటే వాహనం నుంచి శబ్దం వచ్చిందన్నారు. ముందు జాగ్రత్తగా చాలా స్లోగా వాహనం నడపడంతో రోడ్డు మధ్యలోనే తన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ టైర్ ఊడిపోయిందని తెలిపారు. ఒకవేళ తాము సాధారణ వేగంతో వెళ్లి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి.. తన వాహనం మార్చాలని, లేనిపక్షంలో తనకు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


పలుమార్లు రోడ్డు మధ్యలోనే ఆగిపోయిన రాజా సింగ్ వాహనం
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మధ్యలోనే ఆగిపోయింది. ఈ వాహనం 6 సార్లు నడిరోడ్డుపై నిచిలిపోగా.. తాజాగా అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఏకంగా టైర్ ఊడిపోయింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచుగా రోడ్డుపై ఆగిపోతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ చెబుతున్నారు. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని.. అవసరం ఉన్న తనకు మాత్రం సరైన వాహనాన్ని అందించడం లేదని గత నెలలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేకపోవడంతో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు చెప్పానని వివరించారు. అయినా కూడా పోలీసులు వినడం లేదని.. ఇలాంటి వాహనాన్ని ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. 


తన భద్రతకు ముప్పు ఉందని గత ఏడాది ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇంటెలిజెన్స్ ఐజీకి లెటర్‌ రాసిన రాజాసింగ్.. ప్రభుత్వంపై సెటైర్లు కూడా వేశారు. తన బుల్లెట్ ప్రూఫ్‌ వాహనం మార్చాలని రిక్వెస్ట్ చేశారు. తరచూ తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం బ్రేక్‌డౌన్ అవుతుందని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రావడం ఏంటో అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త వాహనాలు కొనడానికి డబ్బుల్లేవా లేకుంటే కేసీఆర్ అనుమతి లేదా అని ఆరా తీశారు. ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందా.. లేకుంటే అధికారులే సైలెంట్‌గా ఉంటున్నారా అని అడిగారు.